ప్రజల నమ్మకాన్ని వ మ్ముచేశారు
రణస్థలం : ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు వమ్ముచేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యన్నారాయణ విమర్శించారు. ఆదివారం రణస్థలం విచ్చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీనియర్ నాయకుడని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించి గెలిపిస్తే.. ఆయన మాత్రం ఎంతసేపూ లోకేష్బాబు, చంద్రబాబు అంటూ ఎన్టీఆర్ ట్రస్టుకే పరిమితమయ్యారని విమర్శించారు. ఫోన్చేసి పనులు జరిపించే స్థాయి ఉన్నా, పనిచేయడం లేదన్నారు. పనిచేయడం చేతకాగ, విమర్శలు చేస్తున్నారని, పనిచేసిన తరువాత విమర్శలు చేయాలని హితవు పలికారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చేపడుతున్న తోటపల్లి కాలువ పనులను కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు మంజూరుచేసిన నిధులని, కొత్తగా టీడీపీ ప్రభుత్వం గాని, ఎమ్మెల్యే గాని ఇక్కడ వెలగబెట్టిందేమీ లేదని చెప్పారు.
పుష్కర మరణాల పాపం చంద్రబాబుదే
గోదావరి పుష్కరాల్లో సీఎం చంద్రబాబునాయుడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్భాటాలకు పెద్దపీట వేశారని, పుష్కరాల్లో ప్రజలు చనిపోవడానికి, ఇబ్బందులు పడటానికి కారణమయ్యారని బొత్స విమర్శించారు. చంద్రబాబు తమ ఆర్భాటాలకు, ప్రసారాలుకు పుష్కరాల్లో 35 మంది ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు. టీడీపీ అసమర్థ పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ పటిష్టతకు చర్యలు చేపడుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తేనే ప్రజలు కష్టాలు తీరుతాయన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గొర్లె కిరణ్కుమార్, జెడ్పీటీసీ గొర్లె రాజగోపాల్, పైడి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీలు సనపల నారాయణరావు, టొంపల సీతారాం, మురళీధర్ బాబా, పిన్నింటి సాయికుమార్, లంకలపల్లి ప్రసాద్, దన్నాన రాజీనాయడు, రాజాపంతులు ప్రకాశరావు, భాస్కరరావు, కె.వి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.