అప్పన్నే కొండ ఎక్కించాలి..

అప్పన్నే కొండ ఎక్కించాలి..


సింహగిరి ఘాట్‌లో ఆర్టీసీ బస్సుల మొరాయింపు

కండిషన్‌లో లేని వాహనాలతో తంటా

పట్టించుకోని ఆర్టీసీ అధికారులు


 

సింహాచలం: ఆర్టీసీ బస్సులు సింహగిరి ఘాటీ ఎక్కలేక మొరాయిస్తున్నాయి. ప్రయాణికులు మధ్యలోనే దిగి కాలినడకన కొండపైకి చేరుకోవలసిన దుస్థితి. తరచు ఇలాంటి సంఘటనలు ఘాట్‌రోడ్డులో జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని బస్సు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఘాట్‌రోడ్డులో కండిషన్‌లో లే ని బస్సులను ఆర్టీసీ నడపడం వల్లే తర చు ఇలాంటి సంఘటనలు నెలకొంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోంచి పలు ప్రదేశాల నుంచి సింహగిరికి భక్తులను చేరవేసేందుకు సింహాచలం డిపో బస్సులు నడుపుతోంది. చాలా బస్సులు కండిషన్‌లో లేకపోవడంతో ఘాటీ ఎక్కలేకపోతున్నాయి.



ముఖ్యంగా ఎన్‌టీఆర్ ఘాట్ వద్దకు వచ్చేసరికి మొరాయిస్తున్నాయి. సింహగిరి నుంచి బయలుదేరే బస్సులు మొదటి మలుపు వద్దనున్న ఘాటీ ఎక్కలేకపోతున్నాయి. ఒక్కోసారి ఈ ప్రాం తాల్లో బస్సులు ఘాటీ ఎక్కలేక వెనక్కి వచ్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద చెట్టుని ఆనుకుని గతంలో బస్సు ఆగిన సంఘటన కూడా చోటుచేసుకుంది. ఘాటీ ఎక్కలేని పరిస్థితిలో బస్సుల్లో ఉన్న భక్తులను కిందకు దించాల్సి వస్తోంది. పరిమితికి మించి భక్తులను బస్సుల్లో ఎక్కించుకుంటున్న సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. దీంతో తరకు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కండిషన్‌లో ఉన్న బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు మాట వరసకే చెబుతున్నారు గానీ చేతల్లో చూపించడం లేదు. ఈ విషయంపై డిపో మేనేజర్ దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top