రేపు కృష్ణా జిల్లాకు వైఎస్ జగన్
అంతు చిక్కని వ్యాధి ప్రబలిన కొత్తమాజేరు సందర్శన
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అంతు చిక్కని వ్యాధి ప్రబలిన కొత్తమాజేరు గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు. వ్యాధి కారణంగా ఈ గ్రామంలో 20 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే వార్తలు వస్తున్నాయి.
విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా పార్టీ నేతలు కొత్త మాజేరుకు వెళ్లి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగన్ ఆ గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం 8.30 గంటలకు విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కొత్తమాజేరుకు వెళతారని పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం తెలిపారు.