నేడు విశాఖలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం ఉదయం విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉన్న షాదీఖానాలో జరగనుంది. పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ సాయిరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి సాగి ప్రసాదరాజు ఈ సమావేశంలో జిల్లా పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో పాటు హామీలు నెర్చడంలో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నా విజయవంతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ ధర్నాకు హాజరవుతుండడంతో భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశాలు ఉండడంతో చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.
దీంతో పాటు జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా త్రిసభ్య కమిటీ సభ్యులు సూచనలు చేయనున్నారు. సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాల ఇన్చార్జ్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ట్రేడ్యూనియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున, జిల్లా ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయులు, గిడ్డి ఈశ్వరి, కిలారి సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఇతర జిల్లా నాయకులు పాల్గొననున్నారు.