నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణం
-
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -
హాజరుకానున్న గవర్నర్
సాక్షి, తిరుమల: వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణ వేదికను చలువ పందిళ్లతో అలంకరించారు. భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్న భక్తుల కోసం అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. సుమారు రాత్రి 9-10 గంటల మధ్య జరగనున్న ఈ కల్యాణాన్ని వీక్షించేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం బాబు కూడా ఒంటిమిట్టకు రానున్నారు.
తిరుమల నుంచి పట్టు వస్త్రాలు
ఒంటిమిట్ట రాముని కల్యాణానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పట్టువస్త్రాలు అందనున్నాయి. టీటీడీ తరఫున ఈవో సాంబశివరావు దంపతులు వాటిని సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొంటారు.
ప్రభుత్వం తరఫున కూడా..
కోదండరామునికి రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం గురువారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం రోడ్డు మార్గంలో అర్ధరాత్రి ఆయన తిరుపతికి చేరుకుని అక్కడే బసచేస్తారు. శుక్రవారం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.
భక్తులకు కన్నుల పండువగా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి.. బుధవారం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకం, అర్చనల అనంతరం టీటీడీ నుంచి వచ్చిన ప్రత్యేక పుష్పాలతో స్వామిని అలంకరించారు. రాత్రి గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు.