గ్యాంగ్రేప్ కేసుపై దర్యాప్తు చేయండి
డీసీపీకి బాలల హక్కుల కమిషన్ ఆదేశాలు
హైదరాబాద్: నగరంలోని కంచన్బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలిక (15)పై జరిగిన గ్యాంగ్రేప్ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపీసీఆర్) సుమోటోగా స్వీకరించింది. ఘటనపై సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సౌత్జోన్ డీసీపీ త్రిపాఠికి నోటీసులు జారీ చేసింది.
కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ రమేష్ కొత్వాల్ అక్టోబర్ 8న స్వయంగా కమిషన్ ముందు హాజరుకావాలని కూడా నోటీసులో పేర్కొంది. గ్యాంగ్రేప్ నిందితులతో పాటు కేసు రాజీ కుదుర్చుకోవాలని బాధితులను వేధిస్తున్న వారిని సైతం వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కమిషన్ సభ్యులు ఎండీ రహీముద్దీన్, అచ్యుతరావు, డాక్టర్ మమత రాఘువీర్ పోలీసులను ఆదేశించారు.