గడువు ముగిసింది
పులివెందుల రూరల్ : ఖరీఫ్లో పంటలు సాగు చేసిన రైతులు బీమా చెల్లించడానికి గడువు ముగిసిందని బీమా కంపెనీల నుంచి బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఖరీఫ్లో సాగు చేసిన వేరుశనగ పంటకు సంబంధించి బీమాను వాతావరణ ఆధారిత బీమా, జాతీయ పంటల బీమా కింద రైతులు ప్రీమియం చెల్లించాలి. వాతావరణ ఆధారిత బీమాకు సంబంధించిన ప్రీమియాన్ని రైతులు పంట రుణాల రెన్యువల్స్ సందర్భంగా బ్యాంకులకు చెల్లిస్తారు. అయితే ఈ ఏడాది ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటన చేశారు. తమ పంట రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు పంట రుణాలు రెన్యువల్స్తో పాటు బీమా ప్రీమియం కూడా చెల్లించలేదు.
దీంతో పంటల బీమాకు సంబంధించి ప్రీమియం గడువు ముగియడంతో ఆగస్టు 2 న జీఓ నంబర్-452 విడుదల చేశారు. దీని ప్రకారం.. ప్రీమియం గడువును సెప్టెంబరు 15 వరకు పొడగించారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీఓను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు గడువును తోసిపుచ్చారు. గతంలో ప్రకటించనట్లుగానే ఆగస్టు 31తో గడువు ముగిసిందని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు ప్రీమియం చెల్లించక బీమాకు అనర్హులుగా మిగిలిపోయారు.