ఇక పోస్టాఫీసుల్లో ప్రత్యేక దర్శన టికెట్లు
సాక్షి, తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి ప్రత్యేక ప్రవే శదర్శన(రూ.300) టికెట్లు సులభతరం చేస్తూ పోస్టాఫీ సుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఒకటి రెండు రోజుల్లోనే బయోమెట్రిక్ విధానంలో భక్తులకు టికెట్లు కేటాయించనున్నారు. ఆన్లైన్ బుకింగ్లో రోజుకు 11 వేల టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే మరో నాలుగు వేల టికెట్లను పోస్టాఫీసుల్లోనూ కేటాయించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రయోగాత్మకంగా ఐదు కేంద్రాల్లో వెయ్యి టికెట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పోస్టాఫీసుల్లో రూ. 300 టికెట్లు కేటాయించనున్నారు. తొలుత తిరుపతి, చిత్తూరు, ఏలూరు, విజయనగరం, వరంగల్ నగరాల్లోని పోస్టాఫీసుల్లో ప్రయోగాత్మకంగా రోజుకు వెయ్యి టికెట్లు కేటాయించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో తపాలా శాఖ ద్వారా టికెట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు వెల్లడించారు. లోటుపాట్లు తెలుసుకుని, అందుకు అనుగుణంగా రోజుకు 4 వేల వరకు టికెట్లు కేటాయిస్తామన్నారు.
ఆన్లైన్లోకి మరో 3 వేల టికెట్లు
ఆన్లైన్ పద్ధతిలో రోజుకు 11 వేల వరకు రూ.300 టికెట్లు కేటాయిస్తున్నారు. ఇదే కోటాలో మరో 3 వేల టికెట్లు జత చేసి కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నారు.