అలా రాస్తే నిన్ను లేపేస్తాం

అలా రాస్తే నిన్ను లేపేస్తాం - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా వార్త రాస్తావా.. ఏ ఊరు నీది.. ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎంతధైర్యం... ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టినా అడిగేవాడు లేడు’ అంటూ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరుడు,  టీడీపీ నేత గొట్టిముక్కల వేణు సాక్షి ప్రతినిధిని ఫోన్‌లో తీవ్రస్థాయిలో బెదిరించారు. ‘ముళ్లపూడి చెరలో ముత్యాలమ్మ చెరువు’ శీర్షికన నల్లజర్లలోని చెరువునుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. అధికార వర్గాల్లోను, టీడీపీ శ్రేణుల్లోను కలకలం రేపిన ఈ కథనంపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు అక్కడ సాగుతున్న  వ్యవహారంపై విచారణ కూడా చేపట్టారు.

 

 ఈ నేపథ్యంలో సాక్షి ప్రతినిధికి సోమవారం సాయంత్రం సెల్ నంబర్ 94407 75588 నుంచి రెండుసార్లు మిస్డ్ కాల్స్ వచ్చాయి. సాక్షి ప్రతినిధి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా, ఫోన్ ఎత్తిన వేణు ‘నేను బాపిరాజు మనిషిని.. ఏమి టా వార్త.. నిన్ను లేపేస్తాం.. ఇక్కడ బతుకుదామనే అలాంటి వార్త రాశావా (పచ్చిబూతులు తిడుతూ) నా వాయిస్ మొత్తం రికార్డు చేసినా నన్నెవరూ పీకలేరు..’ అంటూ పత్రికల్లో రాయలేని భాషలో దుర్భాషలాడారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయన్నదే వార్త సారాంశమని, అనుమతి ఉన్నట్టు చూపిస్తే ఆ వార్త కూడా ప్రచురిస్తామని, మీ వివరణ ఏమిటో పంపించాలని ఎన్నిసార్లు, ఏవిధంగా చెప్పినా అతను మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడి ఫోన్ కట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top