అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి
రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటు.. బ్రిటన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రి, వైద్య కళాశాలలు ఏర్పాటుకానున్నాయి. భారత్-యు.కె(యునెటైడ్ కింగ్డమ్) సంయుక్త సంస్థ ఇండో యు.కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ మధ్య శుక్రవారం విశాఖలో ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్లో పర్యటించినపుడు దేశంలో ఇండో-యూకే సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.13,555 కోట్ల( రెండు బిలియన్ డాలర్లు)తో 11 ఆస్పత్రుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
వాటిలో మొదటిది అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడి నుంచే దేశంలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈవో కృష్ణకిశోర్, బ్రిటిష్ సంస్థ తరపున ఆ సంస్థ ఎండీ డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా స్థానిక వుడా కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేశారు. వచ్చే జూన్లోగా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుగాను అమరావతి ప్రాంతం లో వందెకరాలు కేటాయించాలని బ్రిటన్ సంస్థ సీఎంను కోరగా పరిశీలిస్తామన్నారు.