మన మంత్రులు కాగితం పువ్వులేనా !

మన మంత్రులు కాగితం పువ్వులేనా !


 సాక్షి ప్రతినిధి, ఏలూరు :తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెట్టిన జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారంటే.. ఏ పనులైనా ఇట్టే అయిపోతాయని, అభివృద్ధి పరుగులు తీస్తుందని భావించిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా ప్ర‘గతి’ని పక్కన పెడితే సచివులుగా పాలనా వ్యవహారాలపై వీరేం పట్టు సాధించారో ఇటీవల జరిగిన బదిలీల వ్యవహారం స్పష్టం చేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా నుంచి టీడీపీ తరఫున ఏకైక మంత్రిగా ఉన్న పీతల సుజాతకు సీఎం చంద్రబాబు నాయుడు వద్ద మంచి మార్కులే ఉన్నా జిల్లాలో ఆమె మాట ఏ స్థాయిలో చెల్లుబాటు అవుతోందో పార్టీలో చిన్నపాటి కార్యకర్తను అడిగినా చెబుతారు. స్త్రీ, శిశు సంక్షేమ, గనులు, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా ఆమె వ్యవహరిస్తున్నా ఇప్పటివరకు ఆయా శాఖల నుంచి  జిల్లాకు ఏం ఒరిగింది అనడిగితే.. ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 

 రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుకకు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా జిల్లాలో 16 ఇసుక ర్యాంపులు తెరిపించాలని నిర్ణరుుంచారు. అరుుతే, ఇప్పటికీ 9 మాత్రమే తెరుచుకున్నాయి. వీటిలోనూ కేవలం నాలుగు ర్యాంపులే సరిగ్గా పనిచేస్తుండగా, మిగతా ర్యాంపుల నుంచి ఆశించిన స్థాయిలో ఇసుక సరఫరా కావడం లేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ఇసుకు మాఫియాకు అడ్డుకట్ట వేయడంలో సంబంధిత శాఖ మంత్రిగా పీతల సుజాత ఏ మేరకు సఫలమయ్యారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. డ్వాక్రా మహిళలకు కేటాయించిన నబీపేట ఇసుక ర్యాంపు నుంచి రాత్రివేళ జిల్లాస్థాయి టీడీపీ నేత ప్రధాన అనుచరుడు ఒకరు ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీనిపై డ్వాక్రా మహిళలు ప్రశ్నించగా, వివాదం తారస్థాయికి చేరింది. డ్వాక్రా మహిళలు ప్రశ్నించడాన్ని తట్టుకోలేని టీడీపీ నేత అనుచరులు నానాయాగీ చేశారు. ‘మీ ర్యాంపును రద్దు చేయిస్తాం.. భర్తలపై కేసులు పెట్టిస్తా’మంటూ రెచ్చిపోయారు.

 

 ఇలా సొంత జిల్లాలోనే డ్వాక్రా మహిళలకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో పీతల సుజాత ఉన్నారంటే.. ఆ శాఖపై ఆమెకున్న పట్టు, పార్టీ వర్గాల్లో ఆమెకున్న బలం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మంత్రిగా అధికారుల బదిలీల వ్యవహారంలోనూ ఆమె ముద్ర కనిపించలేదు. శాఖాపరమైన బదిలీల జాబితాలను నేరుగా సీఎం పేషీకిచ్చి చంద్రబాబుపై విధేయత చూపారు. కానీ.. జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో తనదైన ముద్ర వేయాలంటే అనుకూలురైన అధికారుల అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవేమీ పట్టకుండా జాబితాను బాబుకిచ్చిన ఆమె వ్యవహార శైలి పార్టీ వర్గాల్లోనూ చర్చనీయూంశమవుతోంది. సుజాత దళిత వర్గానికి చెందిన మంత్రి కావడంతో టీడీపీలోని అగ్రవర్ణాలు ఆమెను పట్టించుకోవడం లేదనే వాదన బలంగా ఉంది. అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో వాటన్నింటినీ అధిగమించి శాఖలపైనా, జిల్లా వ్యవహారాలపైనా పట్టు సాధించాల్సిన అవసరం మంత్రి పీతల సుజాతపైనే ఉందన్న భావన ఆమె వర్గీయుల నుంచే వినిపిస్తోంది.

 

 గూడెంకే పరిమితమైన మాణిక్యం

 రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొం డల మాణిక్యాలరావు మొదట్లో దూకుడుగా వ్యవహరించినా ఇటీవల కాలంలో స్పీడు తగ్గించారు. దేవాదాయ శాఖ లోను, ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలనా వ్యవహారాల్లోను తనదైన ముద్ర వేయాలని పరితపించిన ఆయన ఇప్పుడు అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నారు. ఎవరూ తీసుకోవడానికి ఇష్టపడని దేవాదాయ శాఖను మాణిక్యాల రావు ఎంతో ఆనందంగా తీసుకున్నారు. ఆ శాఖ రూపురేఖలు మొత్తం మార్చేయాలని భావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో విద్యాలయాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు.

 

 దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయూలని నిర్ణరుుంచుకున్నారు. కానీ.. ఆయన చేసిన ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఇటీవల జరిగిన దేవాదాయ శాఖ అధికారుల బదిలీల్లోనూ మాణిక్యం ముద్ర లేదనే అంటున్నారు. పలు ఆలయూల ఈవోలుగా ఎన్నాళ్ల నుంచో పాతుకుపోయిన ఇతర శాఖల అధికారులను మాతృశాఖకు పంపి, ఆయా పోస్టుల్లో దేవాదాయ శాఖ అధికారులకే అవకాశం ఇవ్వాలని మాణిక్యాలరావు భావించారు. అలా చేస్తే ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు వేగంగా వస్తాయని ఆశించారు. ఆయన చేసిన ప్రతిపాదనలకు విరుద్ధంగా ఇటీవల జరిగిన బదిలీల్లోనూ వేరే శాఖలు, ప్రధానంగా రెవెన్యూ శాఖకు చెందిన అధికారులనే ఈవో పదవులు వరించాయి.

 

 ఉదాహరణకు జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన సీహెచ్.నరసింగరావు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా బదిలీపై వెళ్లారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల ఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ చాలావరకు సీఎం పేషీ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకే నడిచిందని అంటున్నారు. గోదావరి పుష్కరాలకు నిధుల తీసుకొచ్చే విషయంలోనూ మంత్రి మాట ఏ మేరకు చెల్లుబాటవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాణిక్యాలరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎక్కువ రోజులు తాడేపల్లిగూడెంకే పరిమితమై ఆ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబుపై మంత్రి సుజాత విధేయత.. ప్రస్తుత వ్యవహారాలతో విసుగు చెందిన మంత్రి మాణిక్యాల రావు మొక్కుబడి తీరు జిల్లాలో పాలనా వ్యవహారాలను ఎటువైపు తీసుకు వెళ్తాయో చూడాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top