భర్తే కాలయముడు
► భార్యను రోకలితో కొట్టి దారుణ హత్య
► అడ్డుపడిన తల్లి, మరో ఇద్దరు మహిళలపైనా దాడి
కోనేటిరాజుపాళెం (నాయుడుపేటటౌన్): అనుమానం పెనుభూతంగా మారడంతో భార్య పాలిట కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. రోకలితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాధ ఘటన కోనేటిరాజుపాళెం దళితవాడలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల కథనం మేరకు.. కోట మండలం శ్యాంసుందరపురానికి చెందిన రమణమ్మ అలియాస్ లక్ష్మి(20)కు సమీప బంధువైన నాయుడుపేట మండలం కోనేటిరాజుపాళెం అరుంధతీయవాడకు చెందిన పాళెపు శేఖర్తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.
శేఖర్ గ్రామ సమీపంలోని గ్రీన్టెక్ పరిశ్రమలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. భార్య రమణమ్మ అక్కడే ఉన్న అట్టల పరిశ్రమలో పనిచేస్తోంది. ఇటీవల పెళ్లి జరిగి మూడేళ్లు కావస్తున్న పిల్లలు పుట్టలేదని తరచూ శేఖర్ మద్యం సేవించి భార్యను అనుమానిస్తూ వేధించడం మొదలు పెట్టా డు. దీనికి తోడు రమణమ్మపై స్థానికులు కొందరు లేనిపోనివి కల్పిం చి చెప్పడంతో అనుమానం మరింతగా బలపడింది. గురువారం సాయంత్రం కాలనీవాసులు ఎక్కువ మంది సమీపంలోని అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కొలుపు ఉత్సవాలకు వెళ్లారు.
ఈ సమయంలో శేఖర్ అతిగా మద్యం సేవించి ఇంట్లో ఉన్న భార్య రమణమ్మ వద్దకు వెళ్లి ఘర్షణ పడ్డాడు. గమనించిన ఇంట్లో ఉన్న దివ్యాంగురాలైన శేఖర్ తల్లి రమణమ్మ, సమీపంలో నివాసం ఉంటున్న జీవిత, విజయమ్మ భార్యపై దాడి చేస్తున్న శేఖర్ను అడ్డుకునేందుకు ప్రయత్నిం చారు. వారిపైన శేఖర్ దాడి చేయడంతో భయాందోళనలకు గురై గ్రామంలోకి పరుగులు తీశారు.
గ్రామస్తులను వెంటబెట్టుకుని వచ్చేసరికే రోకలితో తలపై కిరాతకంగా కొట్టడంతో రమణమ్మ కుప్పకూలిపోయి మృత్యువాత పడింది. దీంతో స్థానికులు శేఖర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై రవినాయక్ హత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.