నేపాల్‌యాత్రకు వెళ్లిన నగర వాసులు సురక్షితం


గాంధీనగర్ : నేపాల్‌లోని పశుపతినాథ్ యాత్రకు వెళ్లిన గాంధీనగర్ వాసులు ఎనిమిది మంది  సురక్షితంగా ఉన్నట్లు ఆదివారం సమాచారం అందింది. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో యాత్రికుల వివరాలను అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు ఆదివారం వెల్లడించారు. సీతన్నపేట, సత్యనారాయణపురం, వన్‌టౌన్‌కు చెందిన 8 మంది హనుమసాయి ట్రావెల్స్ ద్వారా నేపాల్ వెళ్లారన్నారు. పాలకొల్లుకు చెందిన వారి ద్వారా విజయవాడ యాత్రికుల వివరాలు తెలుసుకున్నట్లు తహశీల్దార్ చెప్పారు.



సీతన్నపేటకు చెందిన గాల్లజగ్గ రామకృష్ణ , అతని భార్య నాగలక్ష్మి, కుమారుడు జగదీష్, మరో మహిళ బోను దుర్గాంబ భూకంపం సంభవించిన సమయంలో పశుపతినాథ్ ఆలయంలో ఉండగా, సత్యనారాయణ పురం, వన్‌టౌన్‌కు చెందిన శిఖాకొల్లి వెంకటేశ్వరావు, కోటేశ్వరమ్మ, దేసు కృష్ణమూర్తి, బాల పరమేశ్వరి కోక్రా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం అందించినట్లు చెప్పారు.



భూకంపం సంభవించిన సమయంలో వీరంతా హోటల్‌లోనుంచి బయటకు పరుగులు  తీసి ప్రాణాలు కాపాడుకున్నట్లు తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు పర్యాయాలు వారితో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నట్లు చెప్పారు. యాత్రికుల వివరాలను కలెక్టర్‌కు సమర్పించినట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top