స్పీకర్ కోసమేనా జన్మభూమి?
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రశ్న
నరసరావుపేట వెస్ట్
హుదూద్ తుపాన్ కారణంగా జన్మభూమి కార్యక్రమాలను రాష్ట్రమంతటా రద్దుచేసినా.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోసమే జరుగుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంతో ఎప్పుడు జరగదో తెలియని పరిస్థితుల్లో అధికారులు, ప్రజలు కూడా ఉన్నారన్నారు.
కార్యక్రమాలను రద్దుచేశామని అధికారులు ప్రకటించి మళ్లీ అకస్మాత్తుగా నిర్వహించడం, ఆ కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే రాత్రికి రాత్రే అందుతున్న ప్రత్యేక ఆదేశాల మేరకు జన్మభూమిని నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఇది చాలా దారుణమని డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. స్వీకర్గా వ్యవహరించాల్సిన డాక్టర్ కోడెల ఒక టీడీపీ నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రుణాల కోసం ఏర్పాటుచేసిన కమిటీల్లోనూ టీడీపీ వారిని నియమించుకుని ఆ పార్టీ వర్గీయులకే రుణాలు ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికైనా పక్షపాతధోరణిని విడనాడి అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు రుణాలు అందజేయాలని కోరారు. రేషన్ డీలర్లను కూడా మార్చివేసి పేదలకు అందాల్సిన బియ్యాన్ని డీలర్ల రూపంలో ఉన్న అధికార టీడీపీ కార్యకర్తలు బొక్కుతున్నారని విమర్శించారు.
రొంపిచర్ల మండలంలో కేవలం ఏడు గ్రామాల్లోనూ, నరసరావుపేట మండలంలో 50 శాతం గ్రామాల్లోనూ బియ్యం పంపిణీచేశారన్నారు. రేషన్ బియ్యం పంపిణీ కాకపోతే రానున్న రోజుల్లో తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల పార్టీ కన్వీనర్లు కె.శంకరయాదవ్, పిల్లి ఓబుల్రెడ్డి, నాయకులు నబీసుభాని, గెల్లి బ్రహ్మారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, అట్లూరి ఆంజనేయులు పాల్గొన్నారు.