అధికారిక సమావేశంలో అనధికారులు

అధికారిక సమావేశంలో అనధికారులు - Sakshi


ఉనికి చాటుకునేందుకు టీడీపీ కార్యకర్తల అగచాట్లు

 

 ఆత్మకూరు రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సమావేశం టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని తలపించింది. జన్మభూమి కార్యక్రమ ప్రణాళికలపై మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చిన జెడ్పీ చైర్మన్ రాజశేఖరగౌడును ఆత్మకూరు టీడీపీ కార్యకర్తలు తీసుకువచ్చారు. దీంతో అక్కడి వాతావరణం టీడీపీ కార్యకర్తల సమావేశంలా మారిపోయింది. కార్యక్రమం గురించి తెలియని జెడ్పీ చైర్మన్ ఎంపీడీవో శశికళను అడిగి తెలుసుకొని జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.



అందుకోసం అన్నిశాఖల అధికారులు ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని చెప్పి కూర్చున్నారు. మరోపక్క టీడీపీ కార్యకర్తలు సమావేశంలో కూర్చోవడాన్ని చూసిన అధికారులు వారు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో బయటకు పొమ్మనలేక మిన్నకుండిపోయారు. అనంతరం ఎంపీపీ సౌజన్య ఎంపీపీ హాల్‌తో పాటు ఎంపీడీవో కార్యాలయాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జెడ్పీ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరాముడు, వైస్ ఎంపీపీ పుల్లారెడ్డి, బైర్లూటీ, కొట్టాలచెరువు మెడికల్ ఆఫీసర్లు మంజూష, నాగమహేశ్వరి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శిరీష, సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top