రైతుల పరిస్థితి దయనీయం

రైతుల పరిస్థితి దయనీయం


ఒంగోలు అర్బన్: జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు బూటకపు హామీలు గుప్పించి..తీరా గద్దెనెక్కాక రైతులను నిలువునా మోసగించాడని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధికార పార్టీ ఏవో కుంటిసాకులు చెప్తూ కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. కనీసం రైతులకు పంటల బీమా అయినా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో నిల్వ ఉన్న 20 క్వింటాళ్ల శనగలు మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని

గుర్తుచేశారు.



జిల్లాలోని పలు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. వరి విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌ని అడగ్గా..ఆయన నెల్లూరు జిల్లా అధికారులతో మాట్లాడి వరి విత్తనాల సమస్య పరిష్కరిస్తానని  హామీ ఇచ్చినట్లు వివరించారు. శనగ రైతులపై బ్యాంకర్ల ఒత్తిళ్లు ఆపేలా చూడాలని కోరినట్లు తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులతో తాగునీటి సమస్య అధికంగా ఉందని..బోర్లు వేసి అక్కడి ప్రజలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశానన్నారు. నెలన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్భయ సెంటర్ కోసం స్థలం చూపాలని కోరి నా ఇంత వరకు కేటాయించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా..రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పినట్లు తెలిపారు. తాను పార్లమెంట్ సభ్యునిగా ఎంపికైన తొలి రోజుల్లోనే నగరంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరానని.. దసరా నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలపడం సంతోషకరమన్నారు.



చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే వెలిగొండ పూర్తిచేయాలి:

చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుని ఏడాదిలో  పూర్తి చేస్తానని చెప్పి రూ.75 కోట్లు మాత్రమే  కేటాయించడంలో ఆంతర్యం ఏంటని వైవీ ప్రశ్నిం చారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లయినా సమయం తీసుకొని కనీసం రూ.500 కోట్లు కేటాయించి ప్రాజెక్టుని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top