జెడ్పీలో దొంగలు పడ్డారు!

జెడ్పీలో దొంగలు పడ్డారు! - Sakshi


► కీలక ఆస్తుల రికార్డులు మాయం

►  స్పెషల్‌ ఆడిట్‌ బృంద తనిఖీల్లో బట్టబయలు

► కబ్జాలకు ఎగబడుతున్న అధికార పార్టీ నేతలు

► నీళ్లు నములుతున్న అధికారులు




జిల్లాకు ఆయువు పట్టయిన జెడ్పీలో దొంగలు పడ్డారు. ఇంటి దొంగల పనో.. లేక ఇంకెవరి చేతివాటమో గానీ కార్యాలయంలో ఉండాల్సిన కీలక రికార్డులు, ఫైళ్లు మాయమయ్యాయి. ఏళ్ల క్రితం నాటి జిల్లా పరిషత్‌ కార్యాలయ స్థిర, చర ఆస్తులు, వివిధ రకాల ఆదాయాల వివరాలతో కూడిన రికార్డులు కనిపించకపోవడంతో ఆదాయ, ఆస్తుల లెక్కలు గల్లంతయ్యాయి. జిల్లా పరిషత్‌ ప్లానింగ్‌ విభాగంలో ఉండాల్సిన రికార్డులు మాయం కావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.



సమస్యకు పరిష్కారం కోసం గతంలో పనిచేసిన అధికారులను, అప్పట్లో పంపిన నివేదికల రికార్డుల బూజు దులుపుతున్నారు. ఎలాగైనా ఆస్తుల రికార్డులను తిరిగి తయారు చేసేందుకు కొందరు అధికార సిబ్బంది మల్లగుల్లాలు పడుతుంటే...ఈ మిస్టరీ వెనుక పెద్ద కథ నడుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల అండదండలతోనే రికార్డులు మాయమయ్యావనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




అరసవల్లి(శ్రీకాకుళం): జిల్లా పరిషత్‌కు చెందిన కీలక పత్రాలు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. 38 మండలాలతో పాటు జిల్లా పరిషత్‌ పాఠశాలలు, రోడ్లు, గెస్ట్‌హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్లు, స్థలాలు, తోటలు ఇతరత్రా ఆస్తుల వివరాలతో కూడిన రికార్డులు స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో 2013 వరకు ఉండేవి. ఈ ఫైళ్లు ఆ తర్వాత మాయం కావడంతో అనుమానాలు రేగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న పలు ఆస్తులపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల కన్ను పడడం, తాజాగా రికార్డులు మాయమైన ఘటన తెరమీదకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



ఆడిట్‌ అధికారుల అభ్యంతరాలతో వెలుగులోకి...

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌లలో ఆస్తుల వివరాలను, ఆదాయ వివరాలతో కూడిన రికార్డులను తనిఖీలు చేసేందుకు ప్రత్యేక అకౌంట్స్‌ జనరల్‌ ఆడిట్‌ అధికారులు కొద్ది రోజుల క్రితమే జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో జెడ్పీలో ఆస్తుల వివరాల రికార్డులు చూపించని కారణంగా అభ్యంతరాల (అబ్జెక్షన్‌) కింద చూపించారు. దీంతో స్థానిక జెడ్పీలో రికార్డుల మాయం అంశం తెరమీదకు వచ్చింది. అధికారుల్లో అలజడి మొదలైంది. ఎలాగైనా జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు.



ఈ మేరకు జరిగిన ఆడిట్‌ తనిఖీల్లో గత సీఈవోల నివేదికలను మాత్రమే ఇచ్చి, మిగిలిన రికార్డులను ప్రస్తుత అధికారులు చూపించలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఆడిట్‌ అధికారుల పర్యటనలతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం బయట పడకుండా ఓ ముఖ్య అధికారి, మరో కీలక సూపరింటెండెంట్‌తో కలిసి కొత్త రికార్డు తయారీకి సన్నాహాలు మొదలుపెట్టారు. జిల్లాలో ఉన్న 38 మండలాల నుంచి ఆయా ప్రాంత పరిధిల్లో ఉన్న ఆస్తులు, పాఠశాలలు, రోడ్లు ఇతరత్రా ఆదాయ వ్యవహరాల వివరాలను ప్రత్యేక ఫార్మెట్‌ ద్వారా తెప్పించుకునేందుకు నిర్ణయించడంతోపాటు ఆదేశాలు జారీ చేశారు.



అయితే కేవలం నాలుగు మండలాల నుంచి మాత్రమే ఆస్తుల, ఆదాయాల వివరాలు రాగా, మిగిలిన మండలాల నుంచి ఇంకా సమాచారం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో ఆశ్యర్చకర విషయమేంటంటే..కొన్ని మండలాల్లో అసలు ఆస్తులే లేవంటూ సమాచారం ఇస్తుండడంతో జెడ్పీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమయం తక్కువ ఉండడంతో మండల అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు పెంచుతున్నారు. ఇదిలాఉంటే  ఇదే ఆస్తుల విషయాలను క్షేత్ర స్థాయిలో తేల్చేందుకు ఆడిట్‌ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో మండలాలకే వెళ్లి ఆస్తులను తనిఖీ చేస్తున్నారు. తాజాగా నరసన్నపేట, పోలాకి, జి.సిగడాం, పాతపట్నం, లావేరు మండలాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు.



జెడ్పీ ఆస్తుల కబ్జా కోసమేనా?

జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మండల పరిషత్‌లకు సంబంధించిన ఆస్తులన్నీ జెడ్పీ యాజమాన్యానికే చెందినట్లు చెప్పవచ్చు. ఈ మేరకు ఆయా మండలాల నుంచి ఎలాగైనా ఆస్తుల వివరాలు కాస్తా ఆలస్యంగానైనా వచ్చే అవకాశముంది. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఆస్తుల పరిస్థితి ఏమిటన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. ఒక్క జెడ్పీ కార్యాలయ ఆస్తులకు చెందిన ప్రత్యేక ఫైలు మాయం కావడంతో అధికారులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.



జిల్లా కేంద్రంలో సిబ్బంది క్వార్టర్ల స్థలాలు, రోడ్లు, గెస్ట్‌హౌస్‌ తదితర ఆస్తుల లెక్కలు, కొలతలు ఇంతవరకు తెలియడం లేదు. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువ చేసిన స్టాఫ్‌ క్వార్టర్ల స్థలాలను కబ్జా చేసేందుకే రికార్డులను మాయం చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్ను ఇప్పుడు ఆ స్థలాలపై పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా సంబంధిత ఆస్తుల రికార్డుల మాయం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే చెప్పాలి.



అలాగే జెడ్పీ కార్యాలయ ఆవరణలో వివాదాస్పదమైన మసీదు స్థలం విషయంలో కూడా ఏంచేయలేని పరిస్థితులు తలెత్తున్నాయి. జెడ్పీ అధికారుల వద్ద ఈమేరకు పాత ఆస్తుల రికార్డులు లేకపోవడంతో గతంలోనే తేలిపోయిన మసీదు స్థలం అంశం నేటికీ వివాదంగానే కన్పిస్తోంది. దీంతో అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇక జిల్లాలో రణస్థలం, నరసన్నపేట తదితర మండలాల్లో కూడా జెడ్పీ ఆస్తులపై అధికార పార్టీ నేతల కన్ను పడింది.



ఈమేరకు నరసన్నపేటలో పలు స్థలాలు ఆక్రమణకు గురికావడంతో పాటు కోర్టు మెట్లు ఎక్కాయి. రణస్థలం వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో షాపింగ్‌ కాంప్లెక్సులు నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆస్తులు, ఆదాయాల వివరాలు ఇంకా అధికారులకు తెలియదంటే ఆశ్యర్యం కలిగించకమానదు. ఇదిలాఉంటే మండలాల్లో ప్రస్తుతం ఆడిట్‌ బృందాలు చేస్తున్న తనిఖీల్లో ఇంకేం వాస్తవాలు బయటపడతాయో వేచిచూడాల్సి ఉంది.



ఆడిట్‌ అధికారులకు అడిగిన వివరాలను ఇచ్చాం

ఆడిటింగ్‌ సమయంలో సంబంధిత అధికారులకు అవసరమైన అన్ని రికార్డులను ఇచ్చాము. గతంలో సీఈవోగా పనిచేసిన నాగార్జున సాగర్‌ ఇచ్చిన ఆస్తుల నివేదికను ఆడిట్‌ అధికారులకు సమర్పించాం. రికార్డుల మాయమయ్యాయనే వార్తలో నిజం లేదు. అన్ని రికార్డులు ఉన్నాయి. – బి.నగేష్, సీఈవో, జిల్లా పరిషత్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top