తొలి బిడ్డర్ డబ్బు చెల్లించ లేదు..
►రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ముందుకు రాకపోతే మళ్లీ వేలం వేస్తాం
►సదావర్తి భూముల వేలంపై హైకోర్టుకు సర్కారు నివేదన
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను వేలంలో రూ.60.30 కోట్లకు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ డబ్బు చెల్లించడానికి ముందుకు రాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. టెండర్ నిబంధనల ప్రకారం వేలంలో విజేత డబ్బు చెల్లించని పక్షంలో ద్వితీయ స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని, అతనూ ముందుకు రాకపోతే మళ్లీ వేలం నిర్వహిస్తామని చెప్పింది.
అలాగే తొలి విడత వేలంలో రూ.22 కోట్లకు భూములు దక్కించుకున్న వ్యక్తి తిరిగి వేలం నిర్వహించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని, దీనిపై శుక్రవారం విచారణ జరగనుందని పేర్కొంది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.