న్యాయంకోసం పోరాటం

న్యాయంకోసం పోరాటం - Sakshi


రుణాల మాఫీ, పింఛన్ల సక్రమ పంపిణీ, తుపాను బాధితులను ఆదుకోవాలి 5న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు: జగన్

 

పదవి కోసం మాయమాటలు చెప్పి జనాన్ని గాలికొదిలేశారు

చంద్రబాబు పుణ్యమా అని రైతులు  పంట బీమా కోల్పోయారు

ఇప్పుడు తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులు రుణాలెలా తీరుస్తారు?

తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి నష్టం జరిగింది

పుట్టు పడవలకు కూడా పరిహారం చెల్లించాలి

తుపాను బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటన




‘‘అవిచేస్తాం, ఇవిచేస్తాం అని ఎన్నికల ప్పుడు హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఐదేళ్ళవరకు మీతో పనిలేదు కదా అని గాలికొదిలేసిన వాళ్ళను నిలదీద్దాం. ఏదో ముష్టి వేసినట్లు పరిహారం ఇస్తామంటే ఊరుకోం. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్ల కోసం, రైతు రుణమాఫీ కోసం, హుదుద్ తుఫానులో తీవ్రంగా నష్టపోయిన మీ అందరికీ తక్షణ సహాయం, పునరావాసంకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీస్‌లను నవంబర్ 5న ముట్టడిద్దాం. భారీ ధర్నా చేద్దాం’’అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో తుపానుబాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వై.ఎస్.జగన్ ఏడో రోజు సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను పరామర్శించారు. ఉదయం 9.30 గంటలకు విజయనగరం నుంచి నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం దిబ్బలపాలెం, పూసపాటిరేగ మండలం  తిప్పలవలస గ్రామాల్లో పర్యటనకు  బయలుదేరిన జగన్‌మోహనరెడ్డికి నాతవలస జంక్షన్ మీదుగా అమటాం రావివలస, దల్లిపేట, దిబ్బలపాలెం, తురిట్లిపాలెం, చేపకంచేరు, రెడ్డికంచేరు, తోటపల్లి ఎస్సీ కాలనీ, ముక్కాం, నడిపల్లి, కొప్పెర్ల, తిప్పలవలసలో పర్యటించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం, చీపురుపల్లి, సుభద్రాపురం జంక్షన్ మీదుగా  శ్రీకాకుళం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా దిబ్బలపాలెంలో  ప్రసంగిస్తూ వై.ఎస్. జగన్ ఇలా మాట్లాడారు...



దారిపొడవునా చాలా చోట్ల ఆగుతూ వచ్చాను. విరిగిన చెట్లు, కూలిన ఇళ్లు కనపడుతున్నాయి. ప్రభుత్వాధికారులు ఎవరైనా వచ్చా రా..? ఏమైనా సాయం చేశారా..? నష్టపోయిన వాటి వివరాలు నమోదు చేసుకున్నారా..? అని నన్ను కలసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను, సోదరుడ్ని, తాతను, అవ్వను అడిగా. ఒక్క గవర్నమెంట్ అధికారి మా వద్దకు రాలేదని చెప్పారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని... ఒక్క దమ్మిడీ అయినా సాయం చేశారా? ఎన్ని చెట్లు, ఎన్ని ఇళ్లు కూలిపోయాయని రాసుకున్నారా? (అందరూ లేదని చెప్పారు).

ప్రతి నెలా కిలో రూపాయి బియ్యం 20 కేజీ లు తీసుకుంటాం. చంద్రబాబు ఈ నెల తుఫాను బాధితులకు ఉచితంగా 25 కిలోల బియ్యం ఇస్తాడంట. ఆ 25 కేజీలైనా మీ అందరికీ అందుతున్నాయా అని అడుగుతున్నాను. (అందడంలేదని జనం అన్నారు). వాళ్లకు నచ్చినట్లు ఇష్టారాజ్యం గా ఇస్తున్నారు.ముష్టి వేసినట్లు 25కేజీల బియ్యం ఇస్తున్నారు. గుండెలమీద చెయ్యివేసుకుని మేం ఇంతచేశాం అని చెప్పుకోలేని పరిస్థితి.



చెరకు రైతుల దగ్గరకు వెళ్లినప్పుడు అడిగా క్రాప్ ఇన్యూరెన్స్ ఉందా అని. ‘చంద్రబాబు రుణాలు కట్టొద్దన్నాడు, మేం కట్టలేదు. రుణాలు కట్టని కారణంగా క్రా్‌ప్‌ఇన్యూరెన్స్ లేద’ని వాళ్లు చెబుతున్నారు. బాబు పుణ్యమా అని రైతులకు రుణమాఫీ లేదు, రీషెడ్యూల్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. బ్యాంకుల్లో పంట రుణాలపై 14 శాతం వడ్డీ వేస్తున్నారు, కొత్త రుణాలు ఇవ్వటంలేదు. దీనితో రైతులు వడ్డీ వ్యాపారుల  నుండి రూ.2, రూ.3ల వడ్డీకి రుణాలు తెచ్చి పంటలు వేసుకున్నారు. తుఫానుతో ఆ పంటలు నష్టపోయారు.  ప్రభుత్వానికి ఇవేమీ పట్టడంలేదు.



తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర మూడు జిల్లా ల్లో తుఫానువల్ల ప్రతి ఇంటికి నష్టం జరిగిం ది.తక్షణ సహాయం కింద రూ.5వేలు ఇవ్వాలి. అప్పుడైనా ప్రజలు కనీసం బట్టలు కొనుక్కుం టారు. ఆ డబ్బులతో కూరగాయలు తెచ్చుకుం టారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వడంతోపాటు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో  కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.  ప్రతి కొబ్బరి చెట్టుకి కనీసం రూ.5వేలు, జీడి చెట్లకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలి. మత్స్యకారుల ఫైబర్ బోట్లకు రూ.2.5లక్షలు, వలలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి. సోనా బోట్లకు రూ.25 లక్షలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకోవాలి. పుట్టు పడవలకు కూడా పరిహారం ఇవ్వాలి. ధర్నాలో ఇక్కడి డిమాండ్లను చేరుద్దాం.

 

మీకు ఇస్తున్నది రూ. 50 సాయమే

 

భోగాపురం: తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ చేస్తున్న పర్యటన ఆరోరోజు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీర ప్రాంత గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న కుట్టు పడవలను, ఫైబర్ బోట్లను పరిశీలిస్తూ మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు దానయ్యతో ఆయన సంభాషణ ఇలా సాగింది.



జగన్: ఏమయ్యా..! తుపాను ధాటికి సముద్రం ఒడ్డున్న నివసిస్తున్న మీ ప్రాంతీయులు తీవ్రంగా నష్టపోయారు కదా... ప్రభుత్వం ఏం సాయం చేసింది?



దానయ్య: బాబూ .. తుపాను దెబ్బకు మా ఊరంతా వణికిపోయింది. ఊరిలోకి సముద్రం నీరు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి 50 కిలోల బియ్యం మినహా ఏమీ అందలేదు. అదీ కూడా 300 కార్డుదారులకు ఇవ్వలేదు.

 

జగన్: ప్రభుత్వం 50 కిలోల బియ్యం ఇస్తుందని చెప్పుకుంటోంది వాటి ఖరీదు రూ.50 లే. రేషన్ ద్వారా కిలో ఒక్కంటికి రూ.1 చొప్పున అందించే బియ్యాన్ని ఈనెల ఉచితంగా ఇస్తుంది. అంటే మీకిచ్చేది రూ.50 సాయమే. సరే ఎన్ని బోట్లు పాడైపోయాయి..?

 

దానయ్య: 15 కుట్టు (చెక్కతో చేసిన) పడవులు పూర్తిగా పాడయ్యాయి. ఫైబర్ బోట్లు 36 ఉంటే అందులో ఆరు పూర్తిగా పోనాయి.

 

జగన్
: నష్టం అంచనాలు వేశారా..?



దానయ్య: నష్ట పరిహారం కోసం మేమెంతో ఆశగా ఎదురుచూస్తుంటే సర్వే అధికారులు వచ్చి వారికి నచ్చినోళ్లకే రాసుకువెళ్తున్నారు. కుట్టు పడవ తయారు చేయాలంటే రూ 30. వేలు ఖర్చువుతుంది. దానిలో వేటకు వెళ్లేందుకు ఐదు రకాల వలలు వినియోగించాలంటే రూ. 40 వేల వరకు ఉంటుంది. అవన్నీ పాడైపోయాయి. ఇందులో రాజకీయం చేస్తున్నారన్నా.. ఫైబర్ బోట్లు తయారు చేయాలంటే రూ 3. 50 లక్షల వరకు ఖర్చువుతుంది. పది రోజులు సాయం అందలేదు.



జగన్: ఊరిలో మొత్తం ఎన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి..? అధికారులు నమోదు చేశారా..?

 

చినరాములు: పది రోజులు క్రితం వచ్చిన భారీ ఈదురుగాలులు, వర్షం,  ఇళ్లలోకి వచ్చిన సముద్రపు నీరుతో 450 పూరిళ్లు పూర్తి పాడైపోయాయి. కొన్ని మేడ ఇళ్లు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి.  కొన్నింటినే రాశారు.

 

జగన్: మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. చేయగలిగింది చేద్దాం. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top