అభివృద్ధి పథంలో
-
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల -
నేడు కళాశాల వార్షికోత్సవం
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్లైన్: రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ విద్య, నూతన పరిశోధనల కోసం ఏర్పా టైన ఎస్వీ వ్యవసాయ కళాశాల 53 వసంతాలు పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల 1961లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో(ప్రస్తుతం ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) మూడవ కళాశాలగా ఏర్పాటైంది. నాటి నుంచి దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజున భారతదేశంలో చాలా ముఖ్యమైన వ్యవసాయ కళాశాలగా గుర్తింపు పొందింది.
మొట్టమొదట ఈ కళాశాల స్థాపించినప్పుడు వ్యవసాయంలో డిగ్రీ ప్రోగ్రాం మాత్రమే ఉండేది. 1968లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించారు. తదనంతరం ఈ కళాశాలలో అన్ని విభాగాల్లో డాక్టరేట్(పీహెచ్డీ) ప్రోగ్రాం కూడా ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 1980-81వ సంవత్సరంలో ఇక్కడి ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ‘గ్రామీణ వ్యవసాయ పని అనుభవ పథకం’ ప్రవేశపెట్టారు. దీనిలో విద్యార్థులు ఒక సెమిస్టర్ అంతా రైతులతో పాటు గ్రామాల్లో ఉంటూ, వ్యవసాయంలో మెళకువల గురించి తెలుసుకుంటూ, విశ్వవిద్యాలయం వారి పరిశోధన ఫలితాలను రైతు సోదరులకు అందిస్తూ కోర్సు పూర్తి చేస్తారు.
అదే విధంగా ‘వ్యవసాయ కృషి అనుభవ పథకం’ 2010-11లో ప్రారంభించారు. ఈ కళాశాలలో అధ్యాపకులు తరగతుల్లో పాఠాలు బోధించటమే కాకుండా రైతు సోదరులకు పంటలకు సంబంధించిన పరిశోధన ఫలితాలను అందజేస్తున్నారు. ఈ కళాశాల కొట్టాల, నాగయ్యగారి పల్లె గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల్లోని రైతులకు నిరంతరం వ్యవసాయ సూచనలు ఇస్తూ వారి ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల గురువారం వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కళాశాల అభివృద్దికి మరింత కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్పీ.ఈశ్వర రెడ్డి తెలిపారు.