హైటెక్ సాగు
నల్లగొండ రూరల్, న్యూస్లైన్: వ్యవసాయం చేసిన రైతుకు చివరికి అప్పులు మిగలడం ఆనవాయితీగా వస్తున్నది. దీనిని తిరగరాయాలన్న లక్ష్యంతో ఇంజినీరింగ్ పట్టభద్రులైన కొం దరు యువకులు నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ సాయంతో ఆధునిక వ్యవసా యం చేస్తూ కాసుల పంట పండిస్తున్నారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన 29 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులైన యువకులు రా అండ్ అగ్రి సొసైటీగా ఏ ర్పడి కట్టంగూరు మండలం ఈదులూరులో 2010లో 70 ఎకరాలు కొనుగోలు చేశారు. వారిలో ప్రస్తుతం 19 మంది కలిసి వ్యవసాయం చేపట్టారు. మొత్తం 70 ఎకరాలకుగాను 50 ఎకరాల్లో వివిధ రకాలకూరగాయలు సాగు చేస్తున్నారు.
మల్చింగ్తో నీటి పొదుపు..
ఏ పంట వేసినా మల్చింగ్ (కవర్ పరిచే) విధానాన్ని అవలంబిస్తున్నారు. దీని వల్ల నీరు, ఎరువుల వృథాను అరికట్టవచ్చు. కలుపు, పురుగుల ప్రభావం ఉండదు. నాణ్యమైన, మన్నికైన దిగుబడులు 30శాతం అదనంగా లభిస్తాయి.
టమాటలో ట్రెల్లీసాగు
టమాట పంటకు ట్రెల్లీసాగు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దీనిలో దిగుబడి సమయంలో కాయలు నేలబారకుండా ఉండేందుకు మొక్కలకు పురుకోసలను తీగపద్ధతిలో కడతారు. ఇనుప పైపులను స్తంభాలుగా క్రమపద్ధతిలో ఉపయోగిస్తున్నారు. దీనివ్లల సరైన గాలి, సూర్యరశ్మి మొక్కలకు అందుతుంది.
తొమ్మిది రకాల పంటల సాగు
తొమ్మిదిరకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఒక్కో పంటను రెండు, మూడు ఎకరాల విస్తీర్ణంలో వేశారు. ఒక పంట కాలం పూర్తి అయ్యేలోపు మరో పంట దిగుబడులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. మిర్చి, టమాట, వంగ, బీర, సొర, కాకర, దోస, చిక్కుడు తదితర పంటలు సాగుచేస్తున్నారు.
రూ. కోటి 8 లక్షల పెట్టుబడి
50 ఎకరాల్లో వ్యవసాయం కోసం సొంతంగా రూ. కోటి 8లక్షలు పెట్టుబడి పెట్టారు. బోర్లు ఏర్పాటు, విద్యుత్ మో టార్లు, ట్రాక్టర్ల కొనుగోలు, ఇనుప పైపులు (కడ్డీలకోసం) ట్రాక్టర్ మౌంటెడ్ భూమ్ స్ప్రేయర్ కొనుగోలు, దున్నకం షెడల్ ఏర్పాటు కోసం ఈ మొత్తం ఖర్చు చేశారు.
సోలార్ సిస్టం ఏర్పాటు
మొత్తం 70 ఎకరాలకు 5 బోర్లు ఉన్నాయి. కరెంట్ సమస్య ను అధిగమించేందుకు 5.5 కేవీఎం సామర్థ్యం కలిగిన సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో సోలార్ విద్యుత్ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఐదు వ్యవసాయ మోటార్లు 6గంటల పాటు నీరందిస్తాయి. 2లక్షల నీటి సామర్థ్యం కలిగిన పాంపాండ్ ఏర్పాటు చేశారు. పాంపాండ్లో నీటిని నిల్వ చేసి అవసరమైనపుడు డ్రిప్ ద్వారా నీటిని పంటలకు అందిస్తారు. ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందిస్తున్నా పూర్తిగా డ్రిప్ ఏర్పాటుతోనే పంటల సాగు చేపట్టారు.
శాస్త్రవేత్తల సలహాలతో ముందడుగు
వీరు ఏ పంటలను ఏ సమయంలో వేయాలో..వచ్చే చీడ, పీడలకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలనే సమాచారాన్ని పూర్తిగా ఇంటర్నెట్లో చూసి అమలు చేస్తున్నారు. శాస్త్రవేత్తల సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఏ పంటకు ఎంత ధర, డిమాండ్, మార్కెటింగ్ ఉంటుం ది.. నాణ్యమైన సీడ్ ఎంపిక, సస్యరక్షణ చర్యల కోసం నెట్నే ఉపయోగిస్తున్నారు. మందులను ట్రాక్టర్ మౌంటెడ్ భూమ్ స్ప్రేయర్తో పిచికారీ చేస్తున్నారు. ఇది గుజరాత్ టెక్నాలజీతో ఉంటుంది. దీంతో ఒకేసారి 50 ఫీట్ల వెడల్పులో పిచికారీ చేయొచ్చు.