ఏడాది చిన్నారికి థైరాయిడ్

ఏడాది చిన్నారికి   థైరాయిడ్


కర్నూలు(హాస్పిటల్): అభం శుభం తెలియని చిన్నారిని థైరాయిడ్ జబ్బు పట్టుకుంది. జన్మతః సంక్రమించిన ఈ వ్యాధిని తల్లిదండ్రులు ఏడాది తర్వాత గుర్తించడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్యాపిలికి చెందిన రవికుమార్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య ఓలమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిది మేనరికపు వివాహం. కూతురు భార్గవి(13 నెలలు) కొన్ని నెలలుగా ఎదుగుదల కనిపించడం లేదు. వయస్సు పెరిగే కొద్దీ జరగాల్సిన జీవక్రియలు కానరాలేదు. పాకడం, నడవడం, కూర్చోలేకపోవడం, బోర్లాపడినా ముందుకు జరగలేకపోవడం, నవ్వలేకపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. ఏడిస్తే కీచుగొంతు వినిపించేది. వీరు తరచూ గుంతకల్లులోని ఓ చిన్నపిల్లల వైద్యున్ని సంప్రదించేవారు. ఆయన ఈ లక్షణాలను గుర్తించి కర్నూలులోని ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ పి. శ్రీనివాసులు వద్దకు రెఫర్ చేశారు.



ఆయన పరీక్షలు చేసి పాపకు థైరాయిడ్ ఉన్నట్లు గుర్తించారు. థైరాయిడ్ ప్రొఫైల్‌లో టీఎస్‌హెచ్ 150కి పైగా ఉండటం గమనార్హం. వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ థైరాయిడ్ పరీక్ష చేయిస్తారని, ఈ పాపకు ఇక్కడ అలా చేయించకపోవడం వల్ల ఏడాది వయస్సులో జరగాల్సిన శారీరక అభివృద్ధి జరగలేదన్నారు. ఆ మేరకు ఐక్యూ కూడా పాప కోల్పోతుందన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టిన వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయిస్తే ఈ పాపలాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఆయన సూచించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top