రాజధాని కమిటీ వెనుక దురుద్దేశం
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని నిపుణులను, ప్రతిపక్షాన్ని విస్మరించారు
టీడీపీ నేతలను, వారి సన్నిహితులను కమిటీలో నియమించారు
రుణమాఫీ విషయంలో బాబు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మాణానికి సలహాలు కోరడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసింది కాదని దీని వెనుక దురుద్దేశాలున్నాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఇది టీడీపీ కమిటీ మాదిరిగా ఉందే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని విమర్శించింది. పార్టీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మతో కలిసి కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారేమన్నారంటే... ‘‘ఇప్పటికే జెడ్పీ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన చంద్రబాబు మితిమీరిన అధికారదాహంతోనే రాజధాని విషయంలో ప్రజలను, ప్రతిపక్షాలను భాగస్వాములు చేయడాన్ని విస్మరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మాకు కూడా ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. కొత్త రాజధాని చుట్టూ తన సన్నిహితుల ఆస్తులను పెంచి ఒక ప్రమాదకరమైన వలయాన్ని నిర్మించుకోవాలనే తాపత్రయం చంద్రబాబులో కనిపిస్తోంది.
కొత్త రాజధాని విషయంలో అదే మాదిరి వ్యవహరించడానికే కమిటీని వేశారు. రాజధాని కమిటీలో టీడీపీకి చెందిన, బాబు అనుకూల పారిశ్రామిక వేత్తలే ఉండటం అందుకు నిదర్శనం. రాజధాని ఎంపిక కోసమని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించి త్వరలో నివేదిక సమర్పించే అవకాశమున్న దశలో చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో కమిటీ వేయాల్సిన ఔచిత్యం ఏమిటి? కమిటీలో మున్సిపల్ మంత్రి కనుక పి.నారాయణ, ప్రభుత్వ కార్యదర్శులు ఉండటంలో తప్పు లేదు. సుజనా చౌదరి, బీద మస్తాన్రావు వంటి చంద్రబాబుకు సన్నిహితులను నియమించడమేమిటి? సంజయ్రెడ్డి, బొమ్మిడాల శ్రీనివాస్, శ్రీనిరాజు తదితరులంతా అనుకూలురే. టీడీ పీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన రైతు రుణమాఫీని నీరు గార్చి రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రుణ మాఫీ విషయంలో బాబు ఇంటింటికీ పంచి పెట్టిన కరపత్రాల్లో చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? ఇది రైతులను మోసం చేయడమే.’’