'టీడీపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోంది'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ సమీపంలో గండిపేటలో జరుగుతున్న మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేశారు. 2019లో తెలంగాణలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీ గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు సవాల్ విసిరారు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని, కుట్రలు, కుతంత్రాలతో కాదని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల విక్రయం సరికాదని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తెలుగుజాతి బాగుండాలని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. 1995లో తొలిసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని చెప్పారు. గత 20 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, గౌరవం పొందానని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేనని, టీడీపీ ఒక విశ్వవిద్యాలయమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషిచేద్దామని అన్నారు. 50 రోజుల్లో 54 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, మహానాడులో 12 కోట్ల రూపాయల విరాళం వచ్చిందని చంద్రబాబు వివరించారు.