విద్యార్థి తల పగులగొట్టిన టీచరు
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన విద్యార్థి బంధువులు
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా కొప్పెర్ల గురుకులంలో ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో ఒక విద్యార్థికి తల పగిలింది. తీవ్ర రక్తస్రావమవుతున్న అతడికి పాఠశాలలోనే ప్రథమ చికిత్స చేయించారు. కొప్పెర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డెంకాడ మండలం దొడ్డిబాడవకు చెందిన గొడ్డు ఆనంద్ ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం క్లాస్ అవుతుండగా విద్యార్థి తప్పు చేశాడంటూ ఉపాధ్యాయుడు అట్టతో తీవ్రంగా కొట్టారు. దీంతో విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. రాత్రి 8 గంటల సమయంలో సమాచారం అంది వచ్చిన విద్యార్థి బంధువులు ఆ బాలుడిని సమీపంలో ఉన్న సుందరపేట సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లి తలకు కుట్లు వేయించారు.
తరువాత గురుకులానికి వచ్చిన వారు ఆ ఉపాధ్యాయుడిని నిలదీసి చెప్పులతో దేహశుద్ధి చేశారు. అనంతరం ఉపాధ్యాయుడు, బాధిత విద్యార్థి బంధువులు రాజీపడినట్లు తెలిసింది. ఈ విషయమై పాఠశాల కేర్టేకర్ ఎం.శ్యామ్ప్రసాద్ను అడగగా.. ఉపాధ్యాయుడు మందలించే సందర్భంలో ఆనంద్కు అనుకోకుండా అట్ట తగిలి తీవ్ర గాయమైందని చెప్పారు. పాఠశాలలో ప్రథమ చికిత్స చేశామని తెలిపారు. విద్యార్థి బంధువులు వచ్చి ఉపాధ్యాయుడిపై చేయిచేసుకున్నారని చెప్పారు.