టీడీపీ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ భర్త దాష్టీకం

టీడీపీ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ భర్త దాష్టీకం - Sakshi


వీరఘట్టం: మాటవినని ఉపాధి హామీ ఉద్యోగిపై జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ భర్త(టీడీపీ) బెల్టుతో దాడిచేసిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీరఘట్టం మండలం సీఎస్‌పీ రహదారి నుంచి తూడి వరకు దాదాపు రూ.3లక్షల ఉపాధి హామీ నిధులతో రోడ్డు మంజూరు చేశారు. అధికార పార్టీ నేతలే పనులు దక్కించుకుని యంత్రాలతో పనిని పూర్తి చేశారు. వాటిని పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్ డి.శ్రీనివాసరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.



కూలీలతో చేయించిన మేరకు రూ.96వేలు మంజూరు చేశారు. మిగిలిన బిల్లు పెండింగులో పెట్టారు. ఆ బిల్లు చెల్లించాలని జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ ఖండాపు జ్యోతి భర్త వెంకటరమణ ఒత్తిడి చేసినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. అందుకు టెక్నికల్ అసిస్టెంట్‌పై వెంకటరమణ ఆగ్రహం వ్యక్తంచేశారు.దీనిపై విచారణ నిమిత్తం ఉపాధి హామీ పథకం ఏపీడీ శైలజ సోమవారం తూడి గ్రామానికి వచ్చారు.



ఈ నేపథ్యంలోనే అక్కసుతో ఉన్న ఖండాపు సంయమనం కోల్పోయి తన బెల్టుతీసి శ్రీనివాసరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాదరావుపైనా విరుచుకుపడ్డారు. బాధితులు ఎంపీడీఓ బి.విజయలక్ష్మికి దృష్టికి తెచ్చి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా, దీనిని ఖండాపు వెంకటరమణ ఖండించారు. తాను దాడిచేయలేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top