బొండా జోరు.. ‘తమ్ముళ్ల’ బేజారు


సెంట్రల్ ఎమ్మెల్యే దూకుడుతో పార్టీకి ఓ వర్గం దూరం   నష్ట నివారణకు తమ్ముళ్ల ఎత్తుగడ

సత్యనారాయణపురం కల్యాణ మండపాన్ని బ్రాహ్మణ సంఘానికి ఇప్పిస్తామని కొత్త వివాదం

టీడీపీ ‘చీలిక’ రాజకీయం      బీజేపీ సహా విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధం




విజయవాడ : నగరం నడిబొడ్డున ఉన్న భువనేశ్వరీ పీఠం ఆధీనంలోఉన్న కల్యాణమండపం స్వాధీనం చేయించే వ్యవహారంలో శాసనసభ్యుడు బొండా ఉమా నడిపినట్లుగా ప్రచారం జరుగుతున్న రాజకీయ ఎత్తుగడ ఆ పార్టీ నేతల్లో కంగారు పుట్టించింది. ఎమ్మెల్యే చర్యతో నగరంలో ఒక సామాజిక వర్గానికి పార్టీ దూరమయ్యే ప్రమాదం ఉందనే భయంతో  తెలుగు తమ్ముళ్లంతా నష్ట నివారణకు రంగంలోకి దిగారు. కల్యాణమండపాన్ని తామే బ్రాహ్మణ సంఘానికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించి మరో వివాదానికి వారు బీజం వేశారు. పనిలో పనిగా మిత్రపక్షమైన బీజేపీ సహా మిగిలిన విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు.


కల్యాణ మండపాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి తెచ్చేలాచేసి దానిని తన పార్టీ కార్యాల యంగా మార్చుకోవడానికి ఎమ్మెల్యే రాజ కీయం నడిపారనే ఆరోపణతో బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనకు మిత్రపక్షం బీజేపీతోపాటు విపక్షాలన్నీ గొంతు కలపడంతో తెలుగుతమ్ముళ్లు కంగుతిన్నారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. యన ఆదేశం మేరకు పార్టీ నగర నేతలంతా నష్ట నివారణకు రాజకీయ వ్యూహం సిద్ధం చేశారు. బీజేపీపై దాడికి దిగుతూనే ఆ పార్టీకి చెందిన  దేవాదాయ శాఖమంత్రి  మాణిక్యాలరావుతో కల్యాణమండపం సీలు తొలగించాలని సవాలు చేస్తున్నారు.

 

చీలిక రాజకీయం



 కల్యాణ మండపం స్వాధీనంపై నగరంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు మరో వివాదానికి బీజం వేసి తమ పంతం నెగ్గించుకునే రాజకీయ మంత్రాగానికి తెర లేపారు. కల్యాణ మండపాన్ని బ్రాహ్మణసంఘానికి అప్పగించేలా చేసి పరోక్షంగా దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే వ్యూహానికి సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనతో బ్రాహ్మణ సంఘాల్లో చీలికతెచ్చి తమకు అనుకూలమైన సంఘానికి కట్టబెట్టి పరోక్షంగా దక్కించుకోవాని రాజకీయం నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, అనుబంధ సంఘాల అధ్యక్షుడు పట్టాభి, సూపర్ బజార్ చైర్మన్ రఘురామరాజు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి  బ్రాహ్మణులకు టీడీపీ వ్యతిరేకంకాదంటూ చెప్పారు.  కల్యాణమండపాన్ని వారికి ఇప్పిస్తామన్నారు.  మండపానికి వేసిన సీలు తొలగిస్తామని మాత్రం హామీ ఇవ్వకపోవడం గమనార్హం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top