గ్రేటర్ ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు
శ్రీకాకుళం అర్బన్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు వంటివని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా, ఎంత డబ్బు గుమ్మరించినప్పటికీ ప్రజలు టీడీపీని తిరస్కరించారన్నారు. 150 సీట్లకు టీడీపీకి ఒక్క స్థానం దక్కడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లో అదే తీర్పు పునరావృతం కానుందని రొక్కం స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు పారదర్శకంగా పాలించాలని హితవు పలికారు.