న్యాయం చేయకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం
టీడీపీ నాయకుల హామీతో దీక్ష విరమించిన మాజీ సైనికులు
చిలకలపూడి,(మచిలీపట్నం) : మాజీ సైనికులకు న్యాయం చేయకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జగన్నాథరావు(బుల్లయ్య) స్పష్టం చేశారు. తొమ్మిది రోజులుగా సమస్య పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన మాజీ సైనికుల రిలేదీక్ష శిబిరాన్ని ఆయనతో పాటు మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కౌన్సిలర్లు సందర్శించారు. ఈ సందర్భంగా బుల్లయ్య మాట్లాడుతూ దేశ రక్షణే ధ్యేయంగా పనిచేసిన మాజీ సైనికుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా మాజీ సైనికులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. పోర్టు కోసం ఆ భూమిని అధికారులు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడితే ప్రత్యామ్నాయంగా బందరు పరిసర ప్రాంతాల్లోని మెరక భూమిని కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నం వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేస్తామన్నారు. మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుభానీ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇచ్చిన హామీతో తాము దీక్ష విరమిస్తున్నామని ప్రకటించారు. బుల్లయ్య మాజీ సైనికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు సుబ్రహ్మణ్యం, కోట వెంకట్రావు పాల్గొన్నారు.