కొట్టుకున్న టీడీపీ నేతలు!

కొట్టుకున్న టీడీపీ నేతలు! - Sakshi


► భూమా సన్నిహితుడికి, మరో నేతకు మధ్య మాటకు మాట

► నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాళ్లు.. వాగ్వాదం పెరిగి కొట్టుకున్న వైనం!

► అధికారపార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు.. తీవ్రమైన గ్రూపు తగాదాలు  




సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికారపార్టీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు తిట్టుకునేందుకు పరిమితమైన ఈ విభేదాలు తాజాగా కొట్టుకునే స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులక్రితం భూమా సన్నిహితుడికి, హోటల్‌ నడుపుకునే మరో నేతకు మధ్య మాట మాట పెరిగి ఏకంగా కొట్టుకునేదాకా వెళ్లినట్టు సమాచారం. పార్టీకి ఎవ్వరూ పనిచేయట్లేదని, ఎవరికివారు వచ్చిన సొమ్మును కాజేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకున్నట్టు తెలిసింది.


ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పు మాదిరి ఉండగా.. తాజాగా గంగుల ప్రతాపరెడ్డి చేరికతో టీడీపీలో గ్రూపు తగాదాలు మరింత ముదిరాయి. గంగుల చేరిక పట్ల ఒకవైపు మంత్రి అఖిలప్రియ తీవ్ర అసంతృప్తితో ఉండగా.. మరోవైపు ఎస్పీవై రెడ్డి వర్గం సైతం గుర్రుమంటోంది. ఇన్నాళ్లు తమను ఉపయోగించుకుని ఇప్పుడు ఎంపీ సీటు కోసం వేరేవారిని తెస్తున్నారని ఎస్పీవై రెడ్డి వర్గం లోలోపల రగిలిపోతోంది.


అదే సమయంలో ఏజెంట్ల నియామకం విషయంలో అఖిలప్రియకు, ఎస్‌పీవై రెడ్డి వర్గానికి మధ్య కూడా విభేదాలు ప్రారంభమయ్యాయ. ఇదిలా ఉంటే నేషనల్‌ కాలేజీ అధినేత ఇంతియాజ్‌ చేరిక పట్ల విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి అలకబూనారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఎవ్వరూ ఎవరినీ గౌరవించుకునే పరిస్థితి లేకుండా పోయింది. నేతల మధ్య తీవ్ర విభేదాల నేపథ్యంలో ఉప ఎన్నికలో వారంతా ఎవరికి వారుగా వ్యవహరించే వీలుందనే భావన వ్యక్తమవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top