వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణుల దాడి


మాకవరపాలెం (విశాఖపట్నం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కార్యకర్తపై విశాఖ జిల్లాలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. పాత తగాదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామానికి చెందిన మాసారపు రమణ వైఎస్సార్ సీపీ కార్యకర్త. అతడి అన్న మాసారపు దేముడు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. రాత్రి అన్న అంత్య క్రియల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా రామాలయం సమీపంలో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలైన మాసారపు త్రిమూర్తులు, రామ్మూర్తి, పోలిరెడ్డి పెదబాబు దాడి చేశారు.



తీవ్రంగా గాయపడిన రమణను 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాధితుడి భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. రమణకు, త్రిమూర్తులకు మధ్య వివాదం ఉందని, ఇప్పటికీ కోర్టులో కేసు కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top