సాక్షి సిబ్బందిపై టీడీపీ నేతల దౌర్జన్యం
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. అనంతపురం నగరంలోని ఎంవైఆర్ కల్యాణ మండపంలో వృద్ధాప్య పింఛన్ల జాబితాలను తయారు చేస్తుండటంతో అక్కడి విషయాన్ని కవర్ చేయడానికి సాక్షి రిపోర్టర్ రమణారెడ్డి, ఫొటోగ్రాఫర్ వీరేశ్ వెళ్లారు.
అక్కడ జరుగుతున్న తంతును వాళ్లు ఫొటోలు తీశారు. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ల మీద దాడికి తెగబడ్డారు. ఫొటోగ్రాఫర్ వీరేశ్ వద్ద నుంచి కెమెరా లాక్కుని అందులో ఉన్న ఫొటోలను తొలగించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి సమక్షంలోనే జరగడం విశేషం. టీడీపీ నేతలు, కార్యకర్తలు వాళ్లను చుట్టుముట్టి, దాడిచేసి కొట్టారు. శమంతకమణి ఆదేశంతోనే ఇలా చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దెబ్బలు తిన్న రమణారెడ్డి, వీరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు.