యాదవుల గుస్సా!

యాదవుల గుస్సా!


చీరాల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులు అధికంగా టీడీపీ వెంట నడిచారు. పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలుగా ఉండేవారు. అభ్యర్థులెవరైనా సరే నిక్కచ్చిగా పార్టీ కోసమే పనిచేసేవారు. టీడీపీతో అప్పట్లో యాదవ సామాజిక వర్గానికి విడదీయరాని బంధం ఉండేది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు కూడా పార్టీలో యాదవ సామాజికవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించారు.

 

ఈ క్రమంలోనే జిల్లాలో చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు వంటి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారు. టీడీపీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజిక వర్గంపై చిన్నచూపు చూడటం మెదలు పెట్టాడు. అందుకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క నియోజకవర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి టీడీపీ టికెట్ కేటాయించ లేదు. జిల్లాలో మూడు లక్షలకు పైచీలుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వీరికి ఉంది.

 

ఆది నుంచి ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నా వీరికి ఈ సారి ఎక్కడా రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు స్థానాల కోసం యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ చిమాటా సాంబు, గోర్ల శ్రీనివాస్‌యాదవ్, ఎంఎం కొండయ్య, వైవీ సుబ్బారావు వంటి నేతలు ప్రయత్నించినా బాబు కరుణించలేదు. దీంతో ఆ సామాజిక వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ముందు నుంచీ పార్టీ కోసం శ్రమించిన త మకు ప్రాధాన్యత లేకుండా చేయడం అన్యాయమంటున్నారు.

 

యాదవులను టీడీపీ విస్మరించింది

బుర్ల రాము, అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ యాదవులను పూర్తిగా విస్మరించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా యాదవులు బాబుకు అండగా ఉన్నారు. జిల్లాలో 3 లక్షలకు పైచీలుక ఉన్న యాదవులకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపొవడం అన్యాయం. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని సైతం యాదవులకు కేటాయించింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరలైనా వైఎస్సార్ సీపీ మాత్రం యాద వ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీని బరిలోకి దించింది. కనిగిరి అసెంబ్లీ సీటును కూడా బుర్ర మధుసూదన్ యాదవ్‌కు ఇవ్వడంతో యాదవులాంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

 

 యాదవులను గుర్తించిన వైఎస్సార్ సీపీ

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా అధిక ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు టికెట్ కేటాయించింది. జనరల్‌కు  రిజర్వ్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీ కూడా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చింది. కందుకూరు నుంచి రాచగొర్ల వెంక ట్రావ్, అద్దంకి నుంచి గాలం లక్ష్మికి అవకాశం కల్పించారు. అయితే చివర్లో గాలం లక్ష్మి స్థానంలో ఈదా సుధాకర్‌రెడ్డిని మార్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top