దగా పడ్డారు!


వీరఘట్టం(పాలకొండ): కాంట్రాక్ట్‌ లెక్చరర్లను కచ్చితంగా క్రమబద్ధీకరిస్తామంటూ 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని మరిచిపోయారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యమబాట పట్టారు. హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో గత ఏడాది డిసెంబర్‌ రెండో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి మూడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 రోజుల పాటు సమ్మె చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతోకాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. తర్వాత భేటీ అయిన మంత్రి వర్గం కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయలేమని.. అయితే జీతాన్ని మాత్రం 50 శాతం పెంచుతామని హామీ  ఇచ్చింది. ఈ హామీకి రెండు నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు జీవోను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు.



జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉన్నా యి. సర్కారు అధ్యాపకులతో పాటు 487 మం ది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నా  రు. ఈ విద్యా సంవత్సరం కూడా జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇంతవర కు ప్రభుత్వం రెన్యూవల్స్‌ ఇవ్వకపోవడంతో వీరి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మార్చి 31వ తేదీతో గత విద్యా సంవత్సరం ముగిసింది. రెండు నెలల వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో జీతాలు ఇవ్వరు. దీంతో ఉన్న ఉద్యోగం రెన్యువల్‌ అవ్వక.. జీతం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలా గే వీరితో పాటు జిల్లాలో ఉన్న 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కూడా రెన్యూవల్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.



ఎంతో కీలకం..

ఇంటర్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనలో కాంట్రాక్టు లెక్చరర్ల కృషి చాలా ఉందని కొన్ని సందర్భాల్లో అధికారులే కితాబు ఇచ్చారు. అయితే శక్తివంచన లేకుండా పనిచేస్తున్న ఒప్పం ద అధ్యాపకులపై ప్రభుత్వం కత్తికట్టిందనే చెప్పాలి. ఇంటర్‌లో ప్రైవేటు విద్యను అమితంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. సర్కారు విద్య ను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమైనప్పటికీ...తగినంత మంది అధ్యాపకులు మాత్రం లేదు. దీంతో చాలామంది పిల్లలు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే కారణమనే విమర్శలు వస్తున్నాయి.



బుట్టదాఖలైన ఎన్నికల హమీ  

కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేస్తామని ఎన్ని కల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తుంగలో కలిసిపోయాయి. ఇప్పటివరకూ  ఎని మిదిసార్లు మంత్రి వర్గం భేటీ అయింది. క్రమబద్ధీకరణకు అడ్డంకిగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అవాంతరాలను తొలగించాలనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అయితే కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు సంబంధించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించి మూడేళ్లయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి.  



విద్యార్థుల అవస్థలు

ప్రైవేటుకు దీటుగా సర్కారు విద్య ఉండాలంటే పోటీ తప్పదు. అయితే ప్రభుత్వం తీరుతో ఒప్పంద అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. తరగతులు ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయిలో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు లేకపోవడంతో కళాశాలలు వెలవెలబోతున్నాయి. తక్షణమే కాంట్రాక్ట్‌ అధ్యాపకులను  రెన్యూవల్‌ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top