'వైఎస్ఆర్ సీపీ నేతలను అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని మంటకలిపే విధంగా తమ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను గురి చేస్తోందని, అందుకే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేసినట్లు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో సంఖ్యాబలం లేకపోయినా అభ్యర్థులను నిలబెట్టడం చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమన్నారు.
కర్నూలులో ఓటింగ్కు వస్తున్న వైఎస్ఆర్ సీపీ నేతలను పాణ్యం వద్ద అడ్డుకుంటున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. అభ్యర్థులను అడ్డుకోవడంలో పోలీసులు, అధికారులను అక్రమాలకు గురి చేస్తున్నారన్నారు. రైతులకు టీడీపీ ఏం చేసిందని రైతు భరోసా యాత్ర చేపడుతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గ్రామాల్లో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని, ఏపీలోని 14వేల గ్రామాల్లో కనీసం సంబరాలు చేసుకుంటున్న 400 గ్రామాలనైనా చూపించాలని ఉమ్మారెడ్డి సవాల్ విసిరారు.
కాగా జిల్లాలో శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం పోలింగ్ కొనసాగుతోంది. కర్నూలు, ఆదోని, నంద్యాలలోని ఆర్డీవో కార్యాలయాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 1087 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డి. వెంకటేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థులు దండు శేషుయాదవ్, వి. వెంకటేశ్వరరెడ్డిలు బరిలో ఉన్నారు. ఈ నెల 7వ తేదీన కౌంటింగ్ జరగనుంది.