పతనం దిశగా బాబు పాలన


 పెద్దాపురం : రాష్ట్రంలో పతనం దిశగాచంద్రబాబునాయుడు పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. గత రెండు రోజులుగా పెద్దాపురం మెయిన్‌రోడ్డులోని సౌఖ్య లాడ్జిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్నారు. రుణమాఫీపేరుతో రైతులను నట్టేట ముంచిన ఘనత బాబుకే దక్కిందన్నారు. నిత్యం కార్పొరేట్ శక్తులతో మంతనాలు జరుపుతూ వాళ్లకి కావాల్సిన సదుపాయాలను సమకూర్చే పనిలో పడ్డారన్నారు. తన ఎల్లో మీడియాతో ఊహాజనిత వార్తా కథనాలు ప్రచురించేలా చేసి, నూతన రాజధాని పేరిట లక్షలాది ఎకరాల భూమిని దోచుకుంటున్నారని ఆరోపించారు.

 

 కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దేశప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ప్రజల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అసంతృప్తిలో ఉన్న జనాన్ని సమీకరించి వారి ద్వారా ప్రభుత్వాలపై ఉద్యమాల రూపంలో ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సమావేశంలో రాబోయే రోజుల్లో చేయాల్సి ఉద్యమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సీపీఐ నాయకుల మీసాల సత్యనారాయణ, ముప్పాళ్ల సుబ్బారావు, పెదిరెడ్ల సత్యనారాయణ, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top