బాలారిష్టాల్లో గిరిపుత్రిక!


సీతంపేట: నిరుపేద కుటుంబాలకు చెందిన అవివాహిత యువతులు వివాహం చేసుకుంటే ఆర్థికసాయం కింద వారికి రూ. 50 వేలు ఇస్తామని 2014 ఆగస్టు తొమ్మిదో తేదీన విశాఖలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని వివాహం చేసుకున్న గిరిజన యువతులంతా ఎప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

 

 పరిస్థితి ఇలా..

 ఐటీడీఏ పరిధిలో 20 ట్రైబుల్ సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు ఈ పథకం కింద 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అయితే ప్రభత్వం నుంచి కేవలం పన్నెండున్నర లక్షల రూపాయల నిధులు మాత్రమే మంజూరయ్యాయి. 71 మంది అర్హులకు రూ.35 లక్షల 50 వేలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ..

 

 దానిలో సగం కూడా నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. విడుదలైన అరకొర నిధులు ఎవరికి  ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారోనని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కేవలం 25 మంది వరకు సరిపడా నిధులు మాత్రమే విడుదల కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పథకానికి సంభందించిన సర్వర్ కూడా నిలిచిపోయినట్టు సమాచారం. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్ వద్ద ప్రస్తావించగా వచ్చిన నిధులను ఎంతమందికి సరిపోతే అంతమందికి పంపిణీ చేస్తామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top