మంత్రి లోకేశ్కు చేదు అనుభవం
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పార్టీలో కష్టపడ్డవారికి న్యాయం జరగడం లేదంటూ మంత్రి లోకేశ్ను ఓ కార్యకర్త ప్రశ్నించాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పంచాయతీరాజ్ 40వ వార్షికోత్సవ సమావేశం విజయవాడలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో గొమ్ములూరుకు చెందిన టీడీపీ కార్యకర్త మంత్రి లోకేశ్కు షాకిచ్చాడు.
పార్టీలో కష్టపడుతున్న వారికి న్యాయం జరగడంలేదంటూ టీడీపీ కార్యకర్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును నాలుగుసార్లు కలిసి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యకర్త మాట్లాడుతుండగా లోకేశ్ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. వేదిక మీద ఉన్న మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. నీ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పొద్దని తనను ప్రశ్నించిన కార్యకర్తను హెచ్చరించారు. నామినేటెడ్ పదవుల భర్తీలో కార్యకర్తల అభిప్రాయంతో పాటు ఐవీఆర్ఎస్ పదవులు భర్తీ చేస్తున్నామని చెప్పారు.