తిరుమలలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత ఏడాది డిసెంబరు 28వ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభించారు. స్వామివారి ప్రాశస్త్యంపై 12మంది ఆళ్వార్లు రచించిన నాలాయర దివ్యప్రబంధంలోని మొత్తం నాలుగువేల పాశురాలను ఆలయ జీయంగార్లు 25 రోజులపాటు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు. ఇందులో తొలి 11 రోజుల పాశురాల పఠనాన్ని పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులు రాపత్తుగా పరిగణిస్తారు.
ఇక 22వ రోజును కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజును రామానుజ నూట్రందాది, 24వ రోజును వరాహస్వామివారి సాత్తుమొర, 25 దినమున తణ్ణీరముదుతో ఈ అధ్యయనోత్సవాలను సంపూర్ణంగా ముగించటం సంప్రదాయంగా వస్తోంది. కాగా, వెంకటేశ్వరుని సేవలోనే తన జీవితాన్ని అర్పించిన తిరుమలనంబి సేవల స్మృత్యర్థం ప్రతి ఏడాది జరిపే తన్నీర ముదుత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నారు.