ఎస్వీ మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎస్వీ మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు - Sakshi


నంద్యాల: వైఎస్ఆర్ సీపీ టికెట్ మీద గెలిచి పచ్చ కండువా కప్పుకున్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నంద్యాలలో ఇటీవల టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరైన కార్యక్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు పదవుల పంట పండిందని, సర్కార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని.. ఇది చూసి పక్క నియోజక వర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యే కూడా పోతే బాగుండని అనుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో వేదిక మీద మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఉండటం గమనార్హం. ఇటీవల మృతిచెందిన భూమా నాగిరెడ్డి ఆయనకు భావ అన్న విషయం తెలిసిందే. అయినా ఎమ్మెల్యే ఎక్కడా తగ్గకుండా ఏపీలో వాస్తవ పరిస్థితిపై మాట్లాడటంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.



భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాతే ఆయన కూతురు అఖిలప్రియకు చంద్రబాబు తన కేబినెట్‌లో చోటిచ్చిన విషయాన్ని మోహన్ రెడ్డి గుర్తుచేయడంపై టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. గత మూడేళ్లలో నంద్యాలను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ఉప ఎన్నికలు రాగానే కాపు కల్యాణ మండపం, రోడ్లు వేయిస్తాం అంటూ కేవలం 10 రోజుల్లోనే రూ.300 కోట్ల మేర అభివృద్ధి పథకాలను సర్కార్ ప్రకటించిన విషయం విదితమే. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతేనే సీఎం చంద్రబాబు నాయుడు ఆ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి, కనుక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం ఎమ్మెల్యేలు పోతే బై ఎలెక్షన్లు వస్తే బాగుండని ప్రజలు భావిస్తున్నారని, ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలే అందుకు నిదర్శనమన్నారు.



భూమా నాగిరెడ్డి బతికున్నంతకాలం వరకు ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం నంద్యాలకు ఉప ఎన్నికల తరుణంలో స్థానిక నేతలకు పదవులు ఆశ చూపుతున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లలో నంద్యాలలో మూడు ఇళ్లు కూడా కట్టించని ప్రభుత్వం, ఉప ఎన్నికలున్నందున పదమూడు వేల ఇళ్లు కట్టిస్తామని సర్కార్ ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్‌సీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయి ఉప ఎన్నిక వస్తేనే సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top