సర్వేకే లైన్ క్లియర్


కర్నూలు(రాజ్‌విహార్): మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త రైల్వే లైను మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో మంత్రాలయం ఊసే ఎత్తని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు చివరి నిమిషంలో రూ.13.65 కోట్లు ప్రకటించారు. ఈ లైను ఏర్పాటును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా మళ్లీ సర్వే కోసం నిధులిస్తామని ప్రకటించడంతో జిల్లా ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

 

 అధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి జిల్లా కేంద్రం కర్నూలు

 వరకు కొత్త రైలు మార్గం నిర్మించాలని 45 ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు. కాని పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈలైనుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. రెండు సార్లు సర్వే కోసం కేటాయించిన నిధులు వృధాగా ఖర్చయ్యాయి. ఫలితం లేకుండా పోయింది. భూ సేకరణ, పనుల ప్రారంభానికి నిధులు మంజూరు కాకపోడంతో సర్వేతోనే సరిపెట్టకోవాల్సి వచ్చింది. కర్నూలుకు చెందిన మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి గతంలో ఏడాదిన్నర పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసినా ఈ మార్గం నిర్మాణానికి న్యాయం జరగలేదు. దీంతో ప్రజలతోపాటు భక్తులకు  తీవ్ర నిరాశే మిగిలింది.

 

 45 ఏళ్ల నాటి డిమాండ్.. ఇప్పటికీ కలగానే:

 వాస్తవానికి మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు, కర్నూలు మీదుగా శైవక్షేత్రం శ్రీశైలం వరకు రైలు మార్గం నిర్మించాలన్నది దశాబ్దాల నాటి ప్రతిపాదన. 1970లో కర్నూలు పార్లమెంటు సభ్యులు, ఎమ్మిగనూరు ప్రాంత నేత వై.గాది లింగన్న గౌడ్ మంత్రాలయం నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ప్రస్తావించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

 

 అయితే శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటుకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండలు, లోయలు అడ్డంకిగా మారడంతో కర్నూలు వరకు కుదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కలగానే మిగిలింది. మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మంత్రాలయం లైను ఏర్పాటుకు ఆశలు రేకెత్తించారు. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధి కోసం ఈ లైను నిర్మించాలని 2003లో అప్పటి మంత్రి బీవీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎంపీ కేఈ కృష్ణమూర్తి (ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి) చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏటా ఎన్నికల హామీగా మిగిలిపోతున్న ఈ మార్గం నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు సమాచారం. కొంత మంది టీడీపీ ఎంపీల బృందం అప్పటి రైల్వే బోర్డు సభ్యుడు ఎర్రన్నాయుడుతో కలిసి రైల్వే మంత్రి నితీష్ కుమార్‌ను కలసి మంత్రాలయంకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. అందుకు సానుకూలంగా స్పందించిన అప్పటి రైల్వే మంత్రి 2004లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించడంతో సర్వే పూర్తి చేసి నివేదికలిచ్చారు.

 

 2011లోనే రెండోసారి సర్వే: ఎన్నికల అస్త్రంగా మారిన మంత్రాలయం లైను ఏర్పాటుకు రాఘవేంద్ర స్వామి భక్తులు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, రైల్వే మాజీ సహాయ మంత్రి మునియప్ప ద్వారా 2010లో మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్‌లో రైల్వే లైను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ, భూ కొనుగోలు వ్యయం దృష్ట్యా రీ సర్వే చేయాలని నిర్ణయించారు.

 

 2011 ఫిబ్రవరి 23న రైల్వే పనుల సర్వేకు రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టరు ప్రసాద్‌రెడ్డి టెండర్ దక్కించుకుని సర్వే పూర్తి చేసి 2011 డిసెంబర్‌లో సర్వే నివేదికలు సమర్పించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే, రూ.6 కోట్లతో సర్వే చేసిన సంస్థ చివరకు గతంలో రూపొందించిన (ప్లానింగ్ మ్యాప్) మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని, మంత్రాలయం సమీపంలోని కొండాపురం వద్ద రైల్వే స్టేషను నిర్మించాలని సూచించింది. రైలు మార్గం ఏర్పాటయ్యే ప్రాంతాల్లోనే రైతుల పొలాల్లో హద్దులు కూడా నిర్ధారించారు. అయితే, ఇప్పుడు తాజాగా మళ్లీ సర్వే కోసమే నిధులు కేటాయించారు తప్ప భూ సేకరణ ఊసేలేదు.

 

 మొదట రూ.9.43 లక్షలతో సర్వే చేయగా రెండో సారి రూ.6 కోట్లతో రెండో సర్వే చేసి చివరకు మొదట చేసిన సర్వే ఆధారంగానే రైలు మార్గం నిర్మించుకోవచ్చని సూచించడం గమనార్హం. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సర్వే కోసమే నిధుల ప్రకటన చేశారు. దీంతో ఎన్ని సార్లు సర్వే చేస్తారని, ఇప్పటికే రెండుసార్లు సర్వేలు చేసి నిధులను దుర్వినియోగం చేశారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. సర్వే ఏజెన్సీలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు కంటితుడుపు చర్యగా నిధుల ప్రకటన చేశారు తప్ప పురోగతి కోసం కాని అంటున్నారు.

 

 కేంద్రంపై ఎంపీ బుట్టా ఒత్తిడి

 పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మంత్రాలయం రైలు మార్గం కలను నెరవేర్చాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పట్టుబట్టారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రకటన తరువాత మంత్రాలయం మార్గం ఊసేలేదని తెలిసి మంత్రి సురేశ్ ప్రభుతోపాటు ఎన్‌డీఏ పెద్దలను కలసి విజ్ఞప్తి చేయడంతో చివరి నిమిషంలో సర్వే కోసం రూ.13.65 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

 

 అభివృద్థిలోకి వచ్చే ప్రాంతాలు

 కర్నూలు- మంత్రాలయం మధ్య రైలు మార్గం నిర్మస్తే నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి. కర్నూలుతోపాటు పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలోని మండలాలు, పల్లెలు అభివృద్ధి చెందుతాయి. దీంతో వ్యాపార, వాణిజ్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

 

 ప్రస్తుత రైలు మార్గం ఇలా..

 రైలు మార్గాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవచ్చని సర్వే ప్లాన్ ఇచ్చారు. మంత్రాయం రోడ్డు నుంచి కర్నూలు మధ్య మాధవరం, మంత్రాలయం (మంచాల), ఇబ్రహింపురం, నందవరం, ఎమ్మిగనూరు, ఎర్రకోట, గోనెగండ్ల, హెచ్.కైరవాడి, వేముగోడు, కోడుమూరు, గూడూరు, కె. నాగులాపురం, పెద్ద కొట్టాల వద్ద స్టేషన్లు ఏర్పాటు చేసి కల్లూరు మండలం దూపాడు వద్ద ఉన్న పాత రైల్వే లైనులో అనుసంధానం చేస్తారు. ఇక్కడి నుంచి పాత పట్టాలపైనే రైళ్లు కర్నూలు స్టేషన్‌కు చేరుకుంటాయి.

 

 భారీగా పెరుగుతున్న అంచనాలు

 మంత్రాలయం రైలు మార్గం నిర్మాణ అంచనా విలువ ఏడాదికేడాది పెరుగుతోంది. 2004లో ప్రకటించిన బడ్జెట్‌లో రూ.165 కోట్లతో కర్నూలు- మంత్రాలయం మధ్య రైలు మార్గం నిర్మించాలని అంచనా వేశారు. అయితే ఆ విలువ 2011 నాటికి  రూ.900 కోట్లకు చేరింది. తాజాగా ఇప్పుడు దీని నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10 కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100 కోట్లకు పైగా చేరుతుందని రైల్వే ఇంజినీర్ల అంచనా.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top