శేషాచలం ఎన్కౌంటర్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
శేషాచలం అటవీప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై నేడు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు ఈ విచారణను చేపట్టనున్నారు. మృతుల్లో ఒకరైన తిరుమవళం వాసి భార్య ముత్తుకృష్ణ దాఖలుచేసిన పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఆ మేరకు విచారణ జరపనుంది. ఈ సందర్భంగా వాది, ప్రతివాది తరఫు న్యాయవాదులుతమ వాదనలు వినిపించనున్నారు. ఎన్కౌంటర్ బూటకమని, ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కూలీలను పట్టుకెళ్లి కాల్చిచంపారని ఆరోపిస్తున్న బాధితులు.. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్ కౌంటర్ పై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా నేటినుంచి తన పనిని ప్రారంభించనుంది.
ఏప్రిల్ 2న చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో పోలీస్, అటవీశాఖల జాయింట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది ఎర్రచందనం కూలీలను హతమార్చారు. ఈ కేసును ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.