తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతుల సంఖ్య 2434
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండ తాకిడికి వృద్ధులే కాక యువకులు కూడా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. భానుడి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2434 గా ఉందంటే ఏ విధంగా సూర్యుడు తన ప్రతాప చూపించాడో వేరే చెప్పనక్కర్లేదు. రాష్ట్రాల వారీగా చూస్తే..
తెలంగాణలో
ఇప్పటిదాకా 1192 మంది మరణించారు.. బుధవారం మరణించిన వారిని పరిశీలిస్తే..
నల్గొండ: జిల్లాలోని కోదాడ మండల పరిధిలోని త్రిపురవరం గ్రామానికి చెందిన కొత్త పుల్లమ్మ(54).. ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
మెదక్: సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్లో యాదమ్మ అనే మహిళ మృతి చెందింది.
ఏపీలో ఇప్పటిదాకా 1242 మంది మరణించారు.. ఇందులో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 202 మంది మృత్యువాత పడ్డారు.
బుధవారం నాడు వడదెబ్బ కారణంగా మరణించిన ఏడు మందిని వారిని జిల్లాల వారీగా పరిశీలిస్తే..
వైఎస్సార్జిల్లా: జిల్లాలో బుధవారం నాడు వడదెబ్బ కారణంగా నలుగురు మరణించారు.
రైల్వే కోడూరు మండలం సున్నపురాళ్లపల్లెకి చెందిన వాకాటి ఆదిలక్ష్మి(24) గర్భవతి. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా వడదెబ్బకు గురైంది. రిటైర్డ్ కానిస్టేబుల్ షేక్ బాబుసాహెబ్(74) , ఎం. కృష్ణ(32), గొర్రెల కాపరి గంగమ్మ (40) మరణించారు.
అనంతపురం: జిల్లాలోని లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సంజీవమ్మ(36) అనే మహిళ కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్నం మృతిచెందింది.
చిత్తూరు: జిల్లాలోని రొంపిచర్ల మండలం వాకావారిపల్లికి చెందిన ఎస్.శ్రీనివాసులు (77) బుధవారం ఉదయం మృతి చెందాడు.
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మండలం పుసులూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పెద్ద దిబ్బయ్య (52) మంగళవారం రాత్రి ఇంట్లో నింద్రించగా.. ఉదయం చూసేసరికి మృతి చెంది ఉన్నాడు.