సన్డే
♦ ఆదివారమూ ఎండ అదిరింది
♦ విజయవాడలో 46, మచిలీపట్నం,
♦ గుడివాడల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత
♦ వడదెబ్బ మృతులు 63 మంది
మచిలీపట్నం : జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 7 గంటల నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రి 9, 10 గంటల సమయంలోనూ వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తాకిడికి పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్కోతలు తోడవటంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం విజయవాడలో 46, మచిలీపట్నం, గుడివాడలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీలుగా నమోదైంది. నందిగామలో 44.5, గన్నవరంలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 63మంది వడదెబ్బతో మృతి చెందారు. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే తహశీల్దార్, మండల వైద్యాధికారి, ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఐ నిర్ధారించాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడదెబ్బ కారణంగా మృతి చెందిన వారిని పరి శీలించి నిర్ధారించడానికి సమయం పడుతోంది. సోమవారం నుంచి రోహిణీకార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కలెక్టరేట్లో నిర్వహించే మీ-కోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ బాబు.ఎ ఇప్పటికే ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచే రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్లు నిర్మానుష్యంగా మారిపోతున్నారు. ఎండల్లో బయటకు వచ్చేం దుకు ప్రజలు జంకుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.