రైతులకు సుజనా బంధువు శఠగోపం

పోలీసుల సమక్షంలో రైతులతో మాట్లాడుతున్న విభా సీడ్స్ చైర్మన్ పరుచూరి విద్యాసాగర్ - Sakshi


మొక్కజొన్న రైతులను ముంచిన విభా సీడ్స్ అధినేత విద్యాసాగర్

35రోజుల్లో ఇవ్వాల్సిన బకాయిలు ఏడు నెలలైనా చెల్లించని వైనం

15 రోజుల్లో ఇప్పిస్తామని ఆర్నెల్ల కిందట పంచాయితీ చేసి ముఖం చాటేసిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

తాజాగా తెరమీదకి వ్యవసాయ అధికారులు




సాక్షి ప్రతినిధి, ఏలూరు: కేంద్రమంత్రి సుజనాచౌదరి సమీప బంధువు, విభా సీడ్స్ చైర్మన్ పరుచూరి విద్యాసాగర్ మొక్కజొన్న రైతులకు సుమారు రూ.14 కోట్ల మేర శఠగోపం పెట్టారు. 35 రోజుల్లో ఇవ్వాల్సిన సొమ్మును నెలల తరబడి చెల్లించకుండా వేధిస్తుండటంతో రైతులు ఒత్తిడి చేయగా, ఆరు నెలల కిందట తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో లేఖరాసి త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ నయాపైసా కూడా రాకపోవడంతో వందలాదిమంది రైతు లు సోమవారం ఏలూరులో పోలీస్ గెస్ట్‌హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. వేలాదిమంది రైతుల్లో అలజడి రేపుతున్న ఈ వివాదం పూర్వాపరాలిలా ఉన్నాయి.



పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం, పెదవేగి, చింతలపూడి మండలాల్లోని సుమారు రెండువేల మంది మొక్కజొన్న రైతులు విభా సీడ్స్ విత్తనాలు కొనుగోలు చేశారు. నిర్ణీత సమయానికి పంట కోసి తిరిగి అదే కంపెనీకి విక్రయించారు. 35రోజుల్లోపు ఆ సొమ్మును చెల్లించాల్సి ఉండగా కాలయాపన చేస్తుండటంతో రైతులు కంపెనీ ఆర్గనైజర్లపై ఒత్తిడి తీసుకువచ్చి అధికారపార్టీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు.



రైతుల విజ్ఞప్తి మేరకు గతేడాది జూలై 15న ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ వర్మ విభా సీడ్స్ చైర్మన్ విద్యాసాగర్‌తో చర్చలు జరిపారు. తొలివిడతగా రూ.5 కోట్లను 2014 జూలై 30న చెల్లించేట్టు, మిగిలిన బకాయి ఆగస్టు 30న ఇచ్చేట్టు పంచారుుతీ చేశారు. ఇందుకు విద్యాసాగర్ సమ్మతిస్తున్నట్టు లిఖితపూర్వకంగా రైతులకు హామీ ఇచ్చారు.



సుజనా ఆదేశంతో వెనక్కి తగ్గిన ఎంపీలు, ఎమ్మెల్యేలు!

ఇక్కడ లిఖితపూర్వక హామీ ఇచ్చి హైదరాబాద్ వెళ్లిన విద్యాసాగర్ తన సమీప బంధువు సుజనాచౌదరిని ఆశ్రయించారని, సుజనాచౌదరి ఫోన్ చేసి మాట్లాడడంతో అప్పటివరకు రైతుల తరపున వకాల్తా పుచ్చుకున్న జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు ఆ తరువాత పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడువు తేదీలు ముగిసి నెలలైనా నేటికీ నయాపైసా చెల్లించలేదు. ఒత్తిడి చేస్తే డబ్బుల్లేవ్, కావాలంటే ఇచ్చిన సీడ్ వెనక్కి తీసుకెళ్లండి అంటూ ఎదురుదాడి చేయడంతో దిక్కుతోచని రైతులు పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితం ఏలూరు టూటౌన్, త్రీటౌన్, పెదవేగి, లింగపాలెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.  స్పందించిన పోలీసులు హైదరాబాద్‌లో ఉంటున్న విభా సీడ్స్ చైర్మన్ విద్యాసాగర్‌ను సోమవారం ఉదయం ఏలూరు రప్పించి విచారణ చేపట్టారు.



పోలీస్ గెస్ట్‌హౌస్‌లో రాచమర్యాదలతో విచారణ

విద్యాసాగర్‌ను సోమవారం ఏలూరు తీసుకువచ్చిన పోలీసు అధికారులు పోలీస్ గెస్ట్‌హౌస్‌లో రాచమర్యాదలతో విచారణ చేపట్టారు. గెస్ట్‌హౌస్ బయటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసిన రైతులు చివరికి ఓపిక నశించి ధర్నాకు ఉపక్రమించడంతో పోలీసులు వారిని లోనికి పిలిపించి కింద కూర్చోబెట్టారు. వ్యవసాయ శాఖ జారుుంట్ డెరైక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరి, డెప్యూటీ డెరైక్టర్ అనూరాధ, డీఎస్పీ సరిత విద్యాసాగర్‌తో మాట్లాడి బయటకు వెళ్లిపోయారు. అనంతరం విద్యాసాగర్‌ను భారీ బందోబస్తు మధ్య గెస్ట్‌హౌస్ నుంచి ఆవరణలోకి తీసుకువచ్చిన పోలీసులు రైతులతో మాట్లాడించారు. ‘మీకు నేను డబ్బులు ఇవ్వాల్సిన మాట నిజమే. సొమ్ములు ఎప్పుడిచ్చేది ఈనెల 18న చెబుతాను’ అని చెప్పి  లోనికి వెళ్లిపోయారు.



మండిపడ్డరైతులు

తమకివ్వాల్సిన సొమ్ము చెల్లించకుండా అధికారం అండతో విద్యాసాగర్ కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఇప్పటికే ఆలస్యం కాగా, 18న ఎప్పుడిచ్చేది చెబుతామంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. జగన్నాథపురానికి చెందిన సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రి సుజనాచౌదరి అండతోనే విద్యాసాగర్ ఇంతగా బరితెగించి డబ్బులు ఎగ్గొడుతున్నాడని ఆరోపించారు.



గతంలో లిఖితపూర్వక హామీపత్రంపై సంతకాలు పెట్టిన ఎంపీ మాగంటి బాబును ఇటీవల కలిసి అడిగితే ‘నేనా.. ఎప్పుడు సంతకం పెట్టాను. నాకేం సంబంధం లేదు’ అని ఎదురుతిరిగారని రైతు బొలినేని సుధాకర్ ఆరోపించారు. 18వతేదీన కూడా సరైన పరిష్కారం రాకుంటే హైదరాబాద్ వెళ్లి ఆందోళన చేపడతామని చిలుకూరి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top