చెన్నూరు చక్కెర లేదిక


చెన్నూరు : చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని శాశ్వతంగా మూ సి వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పద వీ విరమణ చేసిన కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి లు, విధుల్లో ఉన్న వారికి వీఆర్‌ఎస్ ఇచ్చి పంపాలని పాలకులు, అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రులు, చక్కర పరిశ్రమల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 10 చెక్కర ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉంటే వాటన్నింటికి నిధులిచ్చి నడపాలని నిర్ణయించి, ఒక్క చెన్నూరు ఫ్యాక్టరీపైనే వివక్ష చూపారు. దీనిని సహకార, ప్రైవేటు రంగాల్లో సైతం నడపడం సాధ్యం కాదంటూ తేల్చారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 19 మంది పర్మినెంటు, 51 మంది సీజనల్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 42నెలలుగా వేతనాలుఅందలేదు.

 

 చంద్రబాబు పాలనలోనే..

 కాంగ్రెస్ ప్రభుత్వం 1977లో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిస్థితులు అనుకూలించక ఒడిదుడుకుల మధ్య నెట్టుకొస్తున్న ఫ్యాక్టరీకి నిధులు విడుదల చేయకపోవడంతో 1995లో చంద్రబాబు పాలనలో మూత పడింది. రూ.కోటి బకాయి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. పదేళ్ల పాటు ఖాయిలా పడ్డ పరిశ్రమ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో 2006 నుంచి మూడేళ్ల పాటు సవ్యంగా నడిచింది. వైఎస్ అప్పట్లో రూ.27 కోట్లు నిధులిచ్చి ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. ఆయన మరణంతో మళ్లీ మూత పడింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం.. పెట్టుబడులు పెట్టాలంటూ విదేశాలు తిరుగుతున్న సీఎం చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని తెరిపించాల్సింది పోయి శాశ్వతంగా మూయాలనుకోవడం తగదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 కథ ముగియనుంది

 రాష్ట్రంలో రెండు చక్కర ఫ్యాక్టరీలు మినహా అన్నీ నష్టాల్లో ఉన్నప్పటికీ  చెన్నూరు ఫ్యాక్టరీని మాత్రమే శాశ్వతంగా మూయాలనుకోవడం అధికార పార్టీ నాయకుల కుట్ర అని ప్రజలు, రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా అనువైన పరిస్థితులున్నాయి. నిర్వహణ లోపం వల్లే నష్టాల్లోకి వెళ్లింది. ప్రభుత్వం నడపలేకపోతే ప్రైవేటు రంగానికైనా అప్పగించాలని కార్మిక నేతలు కోరినా ప్రయోజనం లేకపోయింది. 42 నెలలుగా వేతనాలు అందని కార్మికుల పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వం వెల్లడించలేదు.

 

 జిల్లాపై వివక్ష

 ఫ్యాక్టరీని శాశ్వతంగా మూత వేయాలని నిర్ణయించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే వేలాది మందికి ప్రయోజనం కల్గుతుందని ఏన్నో ఏళ్లుగా పోరాటం చేశాం. రాష్ట్రంలో అన్ని చక్కెర ఫ్యాక్టరీలు నడపాలంటూ నిధులిచ్చిన ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని నడపడం సాధ్యం కాదనడానికి జిల్లాపై వివక్షే కారణమనిపిస్తుంది. జిల్లాలోని నాయకులు చొరవ చూపకపోవడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతు సంఘాలు నామ మాత్రంగా స్పందించాయి. ప్రభుత్వం.. రైతులు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది.      

 - పి.కృష్ణ, చెక్కర ఫ్యాక్టరీల రాష్ట్ర కార్యదర్శి

 

 ప్రైవేట్ వారికి ఇస్తుందనుకున్నాం

 పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని మూత వేస్తుందనుకోలేదు. ప్రైవేటులోనైనా నడిపి ఉంటే, రైతులు, కార్మికులకు ప్రయోజనం కలిగి ఉండేది. నిరుద్యోగులకు ఉపాధి లభించేది. ఇంత దారుణ నిర్ణయం తీసుకోవడం అన్యాయం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

 - వేణుగోపాల్‌రెడ్డి,

 చక్కెర ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మికుడు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top