ఉగ్రదాడిపై ఆగ్రహం
పాకిస్తాన్లోని సైనిక పాఠశాలపై ఉగ్రవాదుల దాడిపై విద్యార్థులు నిరసించారు. తాలిబాన్ల అనాగరిక, ఆటవిక చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించి ఏడురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. మృతి చెందిన విద్యార్థులు,పాఠశాల సిబ్బందికి నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
కడప సెవెన్రోడ్స్: పాకిస్తాన్లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేసి 141 మంది విద్యార్థులు, సిబ్బందిని బలి తీసుకున్న తాలిబాన్ల అనాగరిక, ఆటవిక చర్యపై కడప పుష్పగిరి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్సంఘటనను నిరసిస్తూ బుధవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి వద్ద వందలాది మంది మానవహారం ఏర్పాటు చేశారు. కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థులు, సిబ్బందికి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. నాగరిక సమాజం తలదించుకునే దుశ్చర్యకు పాల్పడిన తాలిబన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను పెట్రోలు పోసి తగులబెట్టి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జిల్లా మేధావి సమాఖ్య కన్వీనర్ ఎం.వివేకానందరెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇన్నాళ్లు తాలిబన్లను పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ రావడం వల్లనే నేడు ఇలాంటి ఘోర కలికి వారుపాల్పడ్డారని పేర్కొన్నారు.
ప్రజల్లో ఇప్పటికే అప్రతిష్ట పాలైన తాలిబన్లు తమ ఉనికి చాటుకోవడానికే అన్నెం పున్నెం ఎరుగని పసి పిల్లలను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా హింసతో సాధించేది ఏమి లేదన్న విషయం చరిత్ర పలుసార్లు రుజువు చేసిందనే సత్యం గ్రహించాలన్నారు. కేవలం శాంతి ద్వారానే ప్రపంచం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ఉగ్రవాదులు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.