చదువు ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బద్వేలుఅర్బన్(వైఎస్సార్ జిల్లా): మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లెలో గల ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితియ సంవత్సరం చదువుతున్న జయలక్ష్మి అనే విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత కొద్ది రోజులుగా పోరుమామిళ్లలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన జయలక్ష్మి ఇటీవలే పాఠశాలకు వచ్చినట్లు తెలిసింది.
అయితే జయలక్ష్మి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు ఫెయిలై చదువుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ తల్లిదండ్రుల బలవంతం మీద పాఠశాలకు పంపడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కాగా జయలక్ష్మికి గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించినట్లు తెలిసింది.