సింగిల్ నెంబర్ లాటరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు


కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : సింగిల్ నెంబర్ లాటరీ టికెట్ల విక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్య లు తీసుకుంటామని బందరు డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బందరు, అవనిగడ్డ సబ్-డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు రహస్యంగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.



లాట రీల నిర్వాహకుల వలలోరోజువారీ కూలీలు, చేతివృత్తుల వారు, రిక్షా, భవన నిర్మాణ కార్మికులు, రోల్డుగోల్డు వర్కర్లు చిక్కుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లాటరీల నిర్వాహకులు టికెట్లను విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. లాటరీల కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు.



   లాటరీ టికెట్లను కొనటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు  సూచించారు. బందరు, అవనిగడ్డ సబ్-డివిజన్లలో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్లు అమ్మేవారిపై పోలీ సులు ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. లాటరీ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే ఆ సమాచారాన్ని నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. లాటరీల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో చిలకలపూడి ఎస్‌హెచ్‌వో టి. సత్యనారాయణ, ఎస్సై లోవరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top