శునకం.. భయానకం

శునకం.. భయానకం - Sakshi


కుక్కకాటుతో జనం విలవిల్లాడుతున్నారు. రాత్రిళ్లే కాదు.. పగటి పూట కూడా కుక్క కనిపిస్తే జడుసుకుంటున్నారు. గత మార్చి నెలలో 1,463 మంది కుక్క కాటుకు గురయ్యారంటే తీవ్రతకు  అద్దం పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వీధి కుక్కలకు కు.ని.ఆపరేషన్ చేయాలని, పిచ్చికుక్కలను చంపేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించినా ఎక్కడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.



1463 గత మార్చిలో కుక్కకాటు బాధితులు

10 ఈ నెల 16న గూడూరులో పిచ్చికుక్కలు కరిచిన వారి సంఖ్య


కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ఆసుపత్రులు 40.. నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరుల్లో ఏరియా ఆసుపత్రులు, కర్నూలులో బోధనాసుపత్రి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ఈ ఆసుపత్రులన్నింటి లో కుక్కకాటుకు యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.



ప్రతి పీహెచ్‌సీలో నీసం నాలుగు వ్యాక్సిన్‌లైనా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్ స్టోర్ నుంచి యాంటిరేబిస్ వ్యాక్సిన్ ఆయా ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. 2012-13లో 32వేలు, 2013-14లో 30వేలు, 2014-15లో 28వేల డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను కుక్కకాటు బాధితులకు అందజేశారు. ప్రస్తుతం డ్రగ్‌స్టోర్‌లో 9,650 డోసులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2,448 డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

 

మార్చిలో 1463 మందికి కుక్కకాటు

జిల్లాలోని 53 పీహెచ్‌సీల పరిధిలో 1463 మంది కుక్కకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అధికంగా కోసిగిలో 54, బేతంచర్లలో 43, గూడూరులో 45, పగిడ్యాలలో 50, జూపాడుబంగ్లాలో 44, తిమ్మాపురంలో 35, మద్దికెరలో 33, మద్దూరులో 42, కలుదేవకుంట్లలో 116, గోనెగండ్లలో 162, మిడుతూరులో 48, ఆస్పరిలో 34, తుగ్గలిలో 30, హుసేనాపురంలో 31 మంది కుక్కకాట్లకు గురయ్యారు. మొ త్తం 1,463 మందిలో 897 మంది పు రుషులు, 566 మంది స్త్రీలు ఉన్నారు.

 

పెద్దాసుపత్రిపైనే భారం

కుక్క కరిచిందంటే చాలు కర్నూలు నగరం నుంచే గాక చుట్టుపక్క గ్రామాల ప్రజలు సైతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఇక్కడ కుక్కకాటుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. రోజూ కొత్తవారు 25 నుంచి 30, పాతవారు 30 నుంచి 40 మంది చికిత్స కోసం వస్తున్నారు. మొత్తంగా నెలకు 1300 మందికి పైగా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి సైతం ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్ స్టోర్ నుంచి యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు.



కుక్కకాటు బాధితులు పెరిగితే మాత్రం ఆసుపత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి వస్తోంది. కుక్క కరిచిన వారికి అభయారబు వ్యాక్సిన్‌ను మొదటిరోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 28వ రోజు వేయించాలి. ముందుజాగ్రత్తగా అయితే మొదటి, ఏడు, 28వ రోజు వ్యాక్సిన్ తప్పనిసరి. గ్రామాల్లో బహిర్బూమికి వెళ్లిన పెద్దలు, చిన్నపిల్లలు ఎక్కువగా కుక్కకాటుకు గురవుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని.. లేకపోతే కర్రలు పట్టుకుని బహిర్బూమికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

శునకాల నియంత్రణకు చర్యలేవీ..

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో వీధికుక్కల నియంత్రణకు చర్యలు కరువయ్యాయి. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో వీధికుక్కలు గుంపులు రావడం చూసి జనం బెంబేలెత్తుతున్నారు. వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం.. లేదా ఇతర పద్ధతుల ద్వారా నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేశారు. తాజాగా రాష్ట్రంలో మూడు, నాలుగు చోట్ల తీవ్రస్థాయిలో కుక్కకాటు బాధితులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది.

 

గ్రామపంచాయతీలకు ఆదేశాలు

కుక్కలను నియంత్రించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయాలకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలను పంపించారు. 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల్లో లెసైన్స్‌లేని వీధి కుక్కలను పట్టుకుని ఎన్‌జీవోలకు అప్పగించాలి. తప్పదనిపిస్తే పిచ్చికుక్కలను చంపేయాలి. మటన్, చికెన్ షాపుల వద్ద పారేస్తున్న వ్యర్థాల వల్ల కుక్కలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.



ఈ మేరకు లెసైన్స్‌లేని మాంసపు విక్రయ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆడ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంలో పశు సంవర్ధక శాఖకు సహకరించాలని పంచాయతీలను ఆదేశించారు. మాంసపు దుకాణాలు వ్యర్థాలకు ప్రత్యేక డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే కర్నూలు మినహా ఇతర ప్రాంతాల్లో నామమాత్రంగానూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

 

కుక్క కరిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...

కుక్క కరిచిన చోట దారగా పారే కుళాయి నీటిని పది నిమిషాల పాటు వదలాలి.

డెటాల్, బెటాడిన్ యాంటిసెప్టిక్ లోషన్ పూయవచ్చు.

పసుపు మంచిదే. కానీ కొమ్మ నుంచి పసుపుపొడిగా మారే సమయంలో కలుషితమై ఉంటే దాని వల్ల గాయంపై ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి ధనుర్వాతం వ్యాధి వస్తుంది.

సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. వైద్యులు సూచించిన మేర మందులు వాడాలి.

కుక్కలు పెంచే వారు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయిస్తే మంచిది. వ్యాక్సిన్ వేయించిన కుక్క మనిషిని కరిస్తే తప్పక యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే.

కుక్క కరిచినా యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారిలో 80 శాతం మందికి రేబిస్ ఎన్‌సెఫలైటిస్ అనే వ్యాధి వస్తుంది. 10 నుంచి 20 శాతం మందికి అసిండింగ్ ఫెరాలసిస్ వ్యాధి వస్తుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top